
160 మంది వ్యాధిగ్రస్తులు
రామభద్రపురం మండలం ఏనుబరువు గ్రామంలో సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిస్క్రీనింగ్ పరీక్షల కోసం బ్లడ్ శ్యాంపిల్ తీస్తున్న వైద్య సిబ్బంది
● జిల్లాలో అందుబాటులో లేని సికిల్సెల్ ఎనీమియా వ్యాధినిర్ధారణ పరీక్షలు
● ప్రభుత్వ వైద్యకళాశాల ఉన్నా అక్కరకురాని సేవలు
● అవస్థలు పడుతున్న బాధితులు
● జిల్లాలో 160 మంది సికిల్సెల్ ఎనీమియా
వ్యాధిగ్రస్తులు
● కొత్తగా మరో 3 కేసుల నమోదు
● మరో నలుగురికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు
ఇక్కడ స్క్రీనింగ్ పరీక్షలు మాత్రమే..
సికిల్సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు కేజీహెచ్లోనే చేస్తారు. అక్కడే వ్యాధి నిర్ధారణ సర్టిఫికెట్ కూడా ఇస్తారు. జిల్లాలో అందుబాటులో లేదు. స్క్రీనింగ్ పరీక్షలు మాత్రమే జిల్లాలో నిర్వహిస్తున్నాం.
– డాక్టర్ కె.రాణి,
జిల్లా అదనపు వైద్యారోగ్యశాఖాధికారి
●
విజయనగరం ఫోర్ట్:
సికిల్సెల్ ఎనీమియా వ్యాధి జిల్లా ప్రజలను భయపెడుతోంది. వ్యాధి నిర్ధారణ సౌకర్యం జిల్లాలో అందుబాటులో లేక పోవడం రోగులకు శాపంగా మారింది. వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నవారు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం విశాఖపట్నం జిల్లాలోని కేజీహెచ్కు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ వైద్యకళాశాల అందుబాటులోకి వచ్చినప్పటికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరగడం లేదు. వ్యాధి సోకిన వారికి తరచూ రక్తం తగ్గిపోతూ ఉంటుంది. ఆ సమయంలో రక్తం ఎక్కిస్తేనే ప్రాణాలు నిలబడతాయి. ఇంతటి ప్రమాదకరమైన వ్యాధికి వైద్యపరీక్షలు అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
జిల్లాలో 160 మంది సికిల్ సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు ఆస్పత్రి రికార్డులు చెబుతున్నాయి. తాజాగా మరో ముగ్గురికి వ్యాధి నిర్ధారణ అయింది. మరో నలుగురికి వ్యాధి లక్షణాలు ఉండడంతో వారికి కేజీహెచ్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
గిరిజన ప్రాంతంలో అధికం
సికిల్సెల్ ఎనీమియా వ్యాధిగ్రస్తులు మైదాన ప్రాంతం కంటే గిరిజన ప్రాంతంలో అధికంగా ఉన్నారు. జిల్లాలో 40 ఏళ్లు లోపు వయసు కలిగిన గిరిజనులు 28 వేల మంది ఉన్నారు. వీరిలో వైద్య సిబ్బంది ఇప్పటి వరకు 24 వేల మందికి సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ నిర్వహించారు. ఇంకా నాలుగువేల మందికి స్క్రీనింగ్ చేయాల్సి ఉంది.
వైద్యసేవలు అందించడంలో కూటమి కినుక
జిల్లాలో సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు వైద్యసేవలు అందుబాటులో లేవు. ప్రైవేటు స్కానింగ్ సెంటర్లలో వ్యాధి నిర్ధారణ చేసుకోవాలంటే అధిక మొత్తంలో ఖర్చు అవుతుంది. ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు తలకు మించిన భారం. వ్యాధిగ్రస్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తానున్నామని కూటమి సర్కారు గొప్పలు చెబుతోందే తప్ప మెరుగైన వైద్యసేవలందించేందుకు చర్యలు తీసుకోవడం లేదని రోగులు ఆరోపిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు జిల్లాలో అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
వ్యాధి లక్షణాలు ఇలా...
రక్తహీనత, ఆయాసం, పొట్ట నొప్పి, ప్రతీ జాయింట్ దగ్గర పెయిన్స్, నీరసం, కాలు మీద పుండ్లు, రక్త ప్రసరణ ఆగిపోవడం జరుగుతుంది. సికిల్సెల్ వ్యాధి వారసత్వంగా వచ్చే ఎర్ర రక్త కణాలు రుగ్మత. ఇది తల్లిదండ్రుల నుంచి అనువంశికంగా సంక్రమిస్తుంది. సామాన్యంగా సాధారణ ఆరోగ్యకరమైన ఎర్రరక్త కణాలు గుండ్రంగా ఉంటే , సికిల్సెల్ వ్యాధిలో కొడవలి వలే అర్ధ చంద్రాకారంలో ఉంటాయి. కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. శ్వాసతీసుకోవడం ఇబ్బంది. అలసట, తరచుగా వచ్చే అంటువ్యాధులు, గర్భధారణ సమయంలో సమస్యలు, అవయవ వైఫల్యం, పెరుగుదల లోపం వంటివి వ్యాధి లక్షణాలు.

160 మంది వ్యాధిగ్రస్తులు