
కాలువలో పడి వ్యక్తి మృతి
● ఐదు రోజుల కిందట అదృశ్యమైన వ్యక్తి..శవమై కనిపించాడు
● కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న కుటుంబ సభ్యులు
తెర్లాం: మోటార్ సైకిల్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడిపోవడంతో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఐదు రోజుల కిందట చోటు చేసుకుంది. ఎస్సై సాగర్బాబు శనివారం తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కూనాయవలస గ్రామానికి చెందిన గిడిజాల చందు (25) ఈ నెల 22వ తేదీ రాత్రి ఆమిటి నుంచి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదవశాత్తూ రోడ్డుపక్కనున్న కాలువలో పడిపోయాడు. ద్విచక్ర వాహనం కింద ఉండిపోవడం.. కాలువలో నీరు పారుతుండడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడికి భార్య స్వాతి, కుమార్తెలు ధన్యశ్రీ, మౌనిక, తల్లిదండ్రులు శ్రీను, విజయ ఉన్నారు.
కనిపించడం లేదంటూ ఫిర్యాదు..
తన భర్త రెండు రోజులుగా కనిపించడం లేదని చందు భార్య స్వాతి, అతని కుటుంబ సభ్యులు ఈ నెల 24న స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా కనిపించకుండా పోయిన వ్యక్తి ఆచూకీ కోసం పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. అయితే కనిపించకుండా పోయిన వ్యక్తి చివరకు శవమై కనిపించడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. చందు కార్పెంటర్గా పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆదుకోవాల్సిన కుమారుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
దుర్వాసన రావడంతో...
స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల విద్యార్థులు విరామ సమయంలో రోడ్డు పక్కకు రాగా దుర్వాసన వచ్చింది. దీంతో కాలువలోకి చూడగా.. మోటార్ సైకిల్ కింద ఓ వ్యక్తి పడిపోయి ఉన్నట్లు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై సాగర్బాబు సిబ్బందితో సహా సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ముందుగా గుర్తు తెలియని మృతదేహంగా భావించినప్పటికీ, కునాయివలసకు చెందిన వ్యక్తి అదృశ్యంపై వచ్చిన ఫిర్యాదు మేరకు వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో చందు కుటుంబ సభ్యులు వచ్చి నిర్దారించడంతో శవపంచనామ నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్సీకి తరలించారు.

కాలువలో పడి వ్యక్తి మృతి