మహారాణిపేట: జిల్లాలో ఈనెల 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జరగనున్న టెట్–2026 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని 8 కేంద్రాల్లో 21,522 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, ప్రత్యేక అవసరాలున్న అభ్యర్థుల కోసం 100 మంది స్క్రైబ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భద్రత, ప్రత్యేక బస్సులు, నిరంతర విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేసి ప్రశాంత వాతావరణం కల్పించాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, డీఈవో ఎన్.ప్రేమ్కుమార్, ఆర్ఐవో మురళీధరన్, పోలీసు, ఆర్టీసీ, విద్యుత్, వైద్య ఆరోగ్య, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.


