తాటిచెట్లపాలెం: విశాఖలోని రైల్వే స్టేడియంలో ఒక భారీ ప్రమాదం తృటిలో తప్పింది. నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం, వీచిన బలమైన ఈదురుగాలుల ధాటికి స్టేడియంలోని ఒక భారీ ఫ్లడ్ లైట్ స్తంభం నేలకూలింది. సాధారణంగా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ రైల్వే స్టేడియానికి నగరంలోని వందలాది మంది ప్రజలు, క్రీడాకారులు వాకింగ్, జాగింగ్, ప్రాక్టీస్ కోసం వస్తుంటారు. అయితే, ఫ్లడ్ లైట్ కూలిన సమయంలో వర్షం, ఈదురుగాలులు కారణంగా మైదానం పూర్తిగా ఖాళీగా ఉంది. వాకర్స్ ఎవరూ అక్కడ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో ఒక పెద్ద విపత్తు తప్పినట్లయింది. కొద్దిసేపు వీచిన గాలులకే అంతటి భారీ ఫ్లడ్ లైట్ స్తంభం విరిగి కిందపడిపోవడం స్థానికంగా కలకలం రేపింది. స్టేడియం ఫ్లడ్ లైట్ల నిర్మాణ నాణ్యత ఏ స్థాయిలో ఉందో, వాటి నిర్వహణను అధికారులు ఎలా పర్యవేక్షిస్తున్నారో అనే అంశాలపై ఇప్పుడు పలువురు ప్రశ్నలు గుప్పిస్తున్నారు.


