మహారాణిపేట: ప్రముఖ నెఫ్రాలజిస్ట్, కేజీహెచ్ మాజీ సూపరింటెండెంట్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మాజీ ఉపకులపతి, మాజీ డీఎంఈ డాక్టర్ టి. రవిరాజును అమెరికాలో ఘనంగా సన్మానించారు. ఇటీవల వాషింగ్టన్ డీసీలోని హయత్ రీజెన్సీ హోటల్లో నిర్వహించిన ఆంధ్రా మెడికల్ కాలేజీ అలుమ్ని ఆఫ్ నార్త్ అమెరికా 8వ ద్వైవార్షిక సమావేశంలో ఆయనకు ‘ఆచార్య’ అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రవిరాజు.. డాక్టర్ ఎం. దాసరాధరం స్మారకోపన్యాసం చేశారు. అనంతరం ఆయనను ఘనంగా సన్మానించి అవార్డును అందజేశారు. ఆమ్కానా అధ్యక్షుడు డాక్టర్ మాణిక్యం ముత్యాల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ ప్రసాద్ చలసాని, నూతన అధ్యక్షురాలు డాక్టర్ నిర్మల పిచ్చిక, కోశాధికారి డాక్టర్ మల్లారెడ్డి మద్దుల, బోర్డ్ సభ్యుడు డాక్టర్ నాగేంద్ర మైనేని సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ను ఆమ్కానా ప్రతినిధులు సన్మానించారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్ ఎం. సంధ్యాదేవి, డాక్టర్ టి. రాధను కూడా సత్కరించారు. మరో పూర్వ విద్యార్థి డాక్టర్ పి. రవీంద్రనాథ్ శర్మ ‘మెడికల్ ఎడ్యుకేషన్ ఇన్ అమెరికా’ అంశంపై ప్రసంగించారు. ఈ సమావేశానికి అమెరికా నలుమూలల నుంచి సుమారు 250 మంది ఆంధ్ర మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థులు హాజరయ్యారు.


