ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

May 19 2026 12:22 AM | Updated on May 19 2026 12:22 AM

అల్లిపురం: ఐపీఎల్‌ మ్యాచ్‌లపై ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముగ్గురు నిందితులను నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు క్రికెట్‌ గురు, లైన్‌ గురు, క్రిక్‌బజ్‌, ప్రజ్వల్‌ 777 వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారమ్‌లు, వాట్సాప్‌ లింకుల ద్వారా ఖాతాలు సృష్టించి బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం అంతకాపల్లికి చెందిన లగుడు రవికుమార్‌, పెందుర్తి మండలం జంగాలపాలేనికి చెందిన గొరపల్లి శివ అప్పారావులను రుషికొండ జంక్షన్‌ పరిసరాల్లో బెట్టింగ్‌ నిర్వహిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 4 మొబైల్‌ ఫోన్లు, రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో కంచరపాలెం జోగారావునగర్‌కు చెందిన జోగి శ్రీనివాసరావును రవీంద్రనగర్‌ బస్టాప్‌ వద్ద అదుపులోకి తీసుకుని, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లు, వాట్సాప్‌ లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీపీ హెచ్చరించారు. సైబర్‌ నేరాలపై ఫిర్యాదుల కోసం cybercrime. gov. in వెబ్‌సైట్‌ లేదా టోల్‌ ఫ్రీ నంబర్‌ 1930 లేదా విశాఖ పోలీస్‌ కమిషనర్‌ హెల్ప్‌లైన్‌ 7995095799 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement