ఈగల్‌ బృందం తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

ఈగల్‌ బృందం తనిఖీలు

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌ పార్క్‌ చేసిన బైక్‌ చోరీ

చేవెళ్ల: డ్రగ్స్‌, గంజాయి, ఇతర మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీస్‌శాఖ ప్రత్యేకంగా ఈగల్‌ బృందంతో తనిఖీలు చేపడుతుందని చేవెళ్ల ఎస్‌ఐ తేజశ్రీ తెలిపారు. ఆదివారం డాగ్‌ స్క్వాడ్‌ బస్‌స్టేషన్‌, చేవెళ్ల పరిసర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్‌ మాదకద్రవ్యాలు లాంటివి నిర్మూలనలో భాగంగా విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మత్తుపదార్థాల వినియోగం, సరఫరా చేయడం చట్ట రీత్యా నేరమని చెప్పారు.

బాలిక అదృశ్యం

పహాడీషరీఫ్‌: బాలిక అదృశ్యమైన సంఘటన బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్‌నగర్‌కు చెందిన హమీద్‌ ఖాన్‌ చిన్న కుమార్తె మెహక్‌(17) ఈ నెల 5న మధ్యాహ్నం స్థానికంగానే ఉన్న మెడికల్‌ షాప్‌లో మందులు తీసుకెళ్లేందుకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమె ఆచూకీ కోసం స్థానికంగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో గాని 87126 62366 నంబర్‌లో సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలిపారు.

పిడుగుపాటుకు

ఎద్దులు మృత్యువాత

చేవెళ్ల: మండలంలోని గుండాల గ్రామంలో ఆదివారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి పిడుగు పడడంతో రెండు ఎద్దులు మృతి చెందాయి. గ్రామానికి చెందిన యాలాల మల్లారెడ్డి అనే రైతు తన వ్యవసాయం పొలం వద్ద చెట్టు కింద ఎద్దులను కట్టేశాడు. పిడుగుపాటుకు ఎద్దులు మృత్యువాత పడ్డాయి. దాదాపు రూ.1.50 లక్షలు నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని కోరుతున్నాడు.

యాలాల: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేస్తూ.. ఎస్పీ స్నేహామెహ్ర ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి రాజీవ్‌ కాలనీకి చెందిన మహబూబా బీ, బషీరాబాద్‌ మండలం కాశీంపూర్‌కు చెందిన అంగన్‌వాడీ ఆయా ఆబేదా బేగంను తీసుకున్న అప్పు ఇస్తామంటూ రమ్మని చెప్పి, మొయినాబాద్‌ ఫాం హౌజ్‌లో దారుణంగా హత్య చేయగా.. విషయం మే 16న వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కరీమాబేగంను కరణ్‌కోట పీఎస్‌కు విచారణ పేరిట తీసుకెళ్లగా, పోలీసుల కళ్లకప్పి యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో పోలీసులు కరీమాను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ కేసులో అదుపులో ఉన్న ప్రధాన నిందితురాలి పట్ల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మహిళా కానిస్టేబుల్‌ సునీత, యాలాల పీఎస్‌కు చెందిన బస్వరాజ్‌ను పోలీసు ఉన్నతాఽధికారి సస్పెండ్‌ చేశారు.

మొయినాబాద్‌: వైన్‌ షాపు ఎదుట పార్క్‌ చేసిన బైక్‌ చోరీకి గురైంది. ఈ సంఘటన మొయినాబాద్‌ పోలీస్‌ష్టేషన్‌ పరిధిలోని హిమాయత్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడ జాగీర్‌ ప్రాంతంలోని కిస్మత్‌పూర్‌కు చెందిన తోకటి ప్రదీప్‌ హిమాయత్‌నగర్‌లోని వైన్స్‌లో పనిచేస్తున్నాడు. ఈ నెల 4న మధ్యాహ్నం రోజు మాదిరిగా తన స్పెండర్‌ బైక్‌ను వైన్స్‌ ముందు పార్క్‌ చేశాడు. రాత్రి 11 గంటల సమయంలో తిరిగి వెళ్లే సమయంలో చూడగా బైక్‌ కనిపించలేదు. పరిసర ప్రాంతాల్లో వెతికినా ఎక్కడా ఆచూకీ లభించంలేదు. దీంతో శనివారం రాత్రి మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement