దుద్యాల్: మండల పరిధిలోని పోలేపల్లిలో ఆదివారం హిందూ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వహకుడు పుర్ర వెంకటయ్య శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి కృష్ణ స్వామి, మ్యాడమ్ ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరవుతారని చెప్పారు.
కొడంగల్ రూరల్: మండల పరిధిలోని రుద్రారం శివారులో 40 రోజుల క్రితం బషీరాబాద్ మండలం జీవన్గి గ్రామానికి చెందిన హరికృష్ణ అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులు, ఉన్నతాధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతూ బాధితులకు న్యాయం చేయాలని మృతుడి కుటుంబసభ్యులు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని మార్కెట్యార్డులో విలేకరులతో మాట్లాడుతూ హరికృష్ణ మృతదేహంపై గాయాలున్నాయని దాడి చేసి హత్య చేసి ఉంటారని ఆరోపించారు. పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు జగదీశ్, గోపి రజక, చంద్రయ్య, సాయిలు, ఆంజనేయులు, వెంకటయ్య, సీహెచ్.లక్ష్మి, అశోక్, న్యాయవాది వెంకటయ్య, కూర వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ రూరల్: ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఓ కూలీ మృతిచెందిన ఘటన వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం నాగారంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన నర్సమ్మ(52) రోజూ మాదిరిగానే శనివారం ఉపాధి పనులకు వెళ్లింది. గంటపాటు పనిచేసిన అనంతరం నీరసంగా ఉందంటూ సమీపంలోని చెట్టు నీడకు వెళ్లి సొమ్మసిల్లి పడిపోయింది. అప్రమత్తమైన తోటి కూలీలు వెంటనే ఆమెను స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని సూచించడంతో 108 వాహనంలో కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మృతురాలికి భర్త మల్లప్ప, కుమారుడు ప్రవీణ్కుమార్ ఉన్నారు.
అనంతగిరి: సీఎంఆర్ఎఫ్తో నిరుపేదలకు మేలు చేకూరుతుందని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజశేఖర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన వికారాబాద్ మండలంలో పలువురు బాధితులకు మంజూరైన చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజు, వైస్ చైర్మన్ మల్లేశం, పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పూడూరు: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన చన్గోముల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి గొంగుపల్లి సీతమ్మ గుడి సమీపంలో ఓ వ్యక్తి గాయాలతో మృతి చెందాడు. మృతుడిది చౌడాపూర్ మండలం అడవి వెంకటాపూర్తండా వాసి మంగ్యానాయక్(38)గా గుర్తించారు. మృతుడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చామని, వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి బార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.


