తాండూరు టౌన్: మండుటెండలు, ఉక్కపోక్కతో ఉక్కిరిబిక్కరవుతున్న ప్రజలకు శనివారం కురిసిన వర్షం ఊరటనిచ్చింది. మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చి సుమారు రెండు గంటలపాటు వర్షం దంచికొట్టింది. గాలిదుమారంతో కూడిన వాన రావడంతో తాండూరు–హైదరాబాద్ మార్గంలో ఓ చెట్టు విరిగి రహదారికి అడ్డంగా పడిపోయింది. సాయిపూర్, పాండురంగ ఆలయం, స్నేహ నగర్, మిత్ర నగర్, గ్రీన్ సిటీ, గుమాస్తా నగర్ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు వెళ్లేందుకు మురుగు కాలువ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో నీరు రోడ్లపైకి చేరింది. ప్రభుత్వ నంబర్ వన్ పాఠశాల వద్ద మోకాలు లోతు వరదనీటితో జనాలు ఇబ్బంది పడ్డారు. డీసీఎంఎస్ ఆవరణలో నిల్వ చేసిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. పట్టణంలోని పలు వార్డుల్లో మురుగు కాలువ వ్యవస్థ సరిగా లేకపోవడంతో మురుగునీరంతా వర్షపు నీటితో కలిసి రోడ్లపై ప్రవహిస్తోందని, దీంతో రోడ్లపై నడిచేందుకు సైతం ఇబ్బంది కలుగుతోందని ప్రజలు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
రోడ్లపైకి చేరిన వర్షపు నీరు


