మెరిసిన మోత్కుపల్లి | - | Sakshi
Sakshi News home page

మెరిసిన మోత్కుపల్లి

Jun 4 2026 7:21 AM | Updated on Jun 4 2026 7:21 AM

జాతీయ పురస్కారం

అందుకున్న గ్రామ పంచాయతీ

వికారాబాద్‌: మన గ్రామ పంచాయతీలు జాతీయ ప్రమాణాలవైపు పయనిస్తున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. రెండేళ్ల క్రితం జిల్లాలోని నాలుగు జీపీలు అంతర్జాతీయ ప్రమాణాల కలిగిన గ్రామాలుగా సర్టిఫికెట్లు అందుకున్నాయి. సుపరిపాలనలో ఓ గ్రామం జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లోనూ కోట్‌పల్లి మండలం మోత్కుపల్లి గ్రామ పంచాయతీ సుపరిపాలనలో జాతీయ పురస్కారానికి ఎంపికై ంది. దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ పంచాయతీ సతత్‌ వికాస్‌ –2025 పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. నానాజిదేశ్‌ముఖ్‌ సర్వోత్తం పంచాయతీ సతత్‌ వికాస్‌ పురస్కారం పేరుతో అందజేసింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజీవ్‌ రంజన్‌సింగ్‌ చేతుల మీదుగా కలెక్టర్‌ దీపక్‌తివారి, డీపీఓ జయసుధ, మోత్కుపల్లి సర్పంచ్‌ అమృతమ్మ, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి అవార్డు అందుకున్నారు.

703 కుటుంబాలు

మోత్కుపల్లి గ్రామంలో 703 కుటుంబాలు, 2,090మంది ఓటర్లు, 2,576 మంది జనాభా ఉన్నారు. 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో ఈ గ్రామం అసెస్‌మెంటు తీసుకోగా 2025 సంవత్సరానికి గాను జాతీయ అవార్డుకు ఎంపికై ంది. అవార్డులకు ఎంపిక అనేక పంచాయతీలు సుపరిపాలన దిశగా పయనిస్తున్నాయి. రికార్డులను పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌లో నిర్వహించడం, నిధుల ఖర్చులో పారదర్శకత, ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడటం, తరచూ సమావేశాల నిర్వహించి ప్రజలను పాలనలో భాగస్వాముల్ని చేయడం లాంటివి జాతీయ స్థాయి అవార్డులకు దోహదం చేస్తున్నాయి.

దోహదం చేసిన అంశాలు

ఉత్తమ జీపీగా ఎంపిక చేయడానికి అనేక అంశాలను దోహదం చేశాయి. ప్రజలకు ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి తేవడం, సక్రమంగా రికార్డులు నిర్వహణ, పారదర్శకత పాలన, ప్రజల భాగస్వామ్యం.. లాంటి వాటిని పరిగణలోకి తీసుకున్నారు. తడి పొడి చెత్తను వేరుచేసే పద్ధతి, మరుగుదొడ్ల నిర్మాణం, వాటి వినియోగం, మురుగు గుంతలు లేకుండా చూసుకోవడం, రోడ్లు, మురుగు కాల్వల శుభ్రత, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ, హరితహారం.. ఇంకుడు గుంతలు, విద్య, వైద్యం, బడి బయటి పిల్లలు, పౌష్టికాహార లోపం, ఇమ్యునైజేషన్‌ తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. వీటితో పాటు గ్రామంలో అక్షరాస్యత పెంచేందుకు చేపడుతున్న కార్యక్రమాలు, జీవన ప్రమాణాలను ప్రభావితం చేసే అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఖర్చు చేసిన నిధులు, పన్నుల వసూలు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు అందిస్తున్న పౌష్టికాహారం, ఉపాధి హామీ పథకంలో వందరోజులు పని చేసిన కుటుంబాలు, లబ్ధి పొందిన కుటుంబాలను ప్రత్యక్షంగా పరిశీలించి జాతీయ అవార్డుల కోసం అప్‌లోడ్‌ చేశారు. ఇందులో దౌల్తాబాద్‌ మండలంలోని దేవర ఫస్లాబాద్‌, కోట్‌పల్లి మండల పరిధిలోని మోత్కుపల్లి వివరాలు పంపించారు. ముందుగా ఈ రెండు జీపీలు రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక కాగా తర్వాత మోత్కుపల్లి జాతీయ స్థాయి సుపరిపాలనలో మూడో స్థానంలో నిలిచింది. ఈ గ్రామానికి రూ.50 లక్షల ప్రైజ్‌మని కూడా వచ్చింది.

జిల్లాకు గతంలోనూ పలు అవార్డులు

2023లోనూ అవార్డుల పంట పండింది. జిల్లాలో 594 జీపీలు ఉండగా నాలుగు గ్రామ పంచాయతీలు ఐఎస్‌ఓ గుర్తింపు పొందాయి. ఒక జీపీ జాతీయ అవార్డును దక్కించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 పంచాయతీలు ఐఎస్‌ఓ(ఇంటర్‌ నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండర్డ్స్‌) అవార్డులు అందుకోగా ఆ ఏడాదిలో మన జిల్లా నుంచే నాలుగు ఎంపికవటం గమనార్హం. వీటిలో చీమల్‌దరి, పులిమద్ది, ఎల్లకొండ, కరన్‌ఖోట్‌ గ్రామాలు ఉన్నాయి.

భారీగా సమకూరనున్న నిధులు

మారనున్న గ్రామ రూపురేఖలు

మరో రెండు జీపీలకు

రాష్ట్రస్థాయి అవార్డులు

Advertisement
 
Advertisement
Advertisement