తాండూరు ఆర్డీఓ అనిత
యాలాల: కొనుగోలు కేంద్రాల నుంచి త్వరగా ధాన్యం తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తాండూరు ఆర్డీఓ అనిత తెలిపారు. బుధవారం యాలాల మండలం దౌలాపూర్ శివారులోని పత్తి మిల్లులను తహసీల్దార్ గాయత్రి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహిపాల్తో కలిసి పరిశీలించారు. ధాన్యం నిల్వ ఉంచేందుకు స్థలం లేకపోవడంతో రైసు మిల్లుల వద్ద అన్లోడింగ్ సమస్య ఏర్పడిందని, దీంతో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోందని మహిపాల్ ఎమ్మెల్యే మనోహర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా ఆర్డీఓ పత్తి మిల్లులను పరిశీలించారు. ధాన్యం నిల్వ ఉంచేందుకు పత్తి మిల్లులు అనుకూలంగా ఉన్నాయని, గతంలో ఇలాగే ధాన్యం బస్తాలను నిల్వ ఉంచారని నాయకులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో ఎస్ఐ విఠల్రెడ్డి, అగ్గనూరు ఉప సర్పంచ్ వెంకటయ్య, జీపీఓ సుజాత, ఏఎంసీ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్, నాయకులు సుధాకర్రెడ్డి తదితరులు పల్గొన్నారు.


