అనంతగిరి: నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని డీఎస్పీ అంజయ్య అన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వికారాబాద్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. నిర్మానుష్య ప్రదేశంలో గంజాయి సేవిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని, అతని నుంచి 2గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ కాలనీలోని ఇంటి ఎదుట గుమిగూడి మద్యం తాగుతున్న పలువురు యువకులను హెచ్చరించి, అక్రమంగా నిల్వ ఉంచిన 55 బీర్ బాటిళ్లు, 43 క్వార్టర్ సీసాలను సీజ్ చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ సమీపంలోని లాడ్జీల్లో తనిఖీ చేశారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న 15 సంవత్సరాల బాలుడిని గమనించి, విచారించగా పేద్దేముల్ మండలం రుక్మాపూర్లోని అతని తల్లిదండ్రులకు ఫోన్ చేసి పిలిపించారు. బాలుడు ఇంటినుంచి పారిపోయి వచ్చాడని తెలిపిన తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నార్సింగి పీఎస్ పరిధిలో బైక్ చోరీకి పాల్పడిన ఓ పాత నేరస్తుడిని రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. ఈ తనిఖీల్లో వికారాబాద్ సీఐ రఘుకుమార్, క్యూఆర్టీ బృందం, వికారాబాద్ క్రైమ్ టీమ్, బ్లూకోట్స్ సిబ్బంది, పోలీస్ స్టేషన్ ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ డీఎస్పీ అంజయ్య


