కొడంగల్ రూరల్: అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కూతురు తల్లి చూస్తుండగానే లారీ చక్రాల కింద నలిగి చనిపోయింది. ఈ విషాద ఘటన పట్టణంలోని బస్టాండు ఎదుట సోమవారం ఉదయం చోటుచేసుకొంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని కార్గిల్ కాలనీకి చెందిన చాంద్పాషా, రెహనాబేగం దంపతులు. పెళ్లయి 30ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో తెలిసిన వారి నుంచి పాపను దత్తత తీసుకుని, ఆయేషా అని పేరు పెట్టి, కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఆయేషా (6)ను బస్టాండు సమీపంలోని ఆల్మాస్ పాఠశాలలో చేర్పించారు. ప్రతీరోజులాగే సోమవారం ఉదయం పాప చేయి పట్టుకుని తల్లి స్కూల్కు తీసుకెళ్తోంది. బస్టాండ్ వద్ద రోడ్డు దాటుతుండగా రావులపల్లి నుంచి పరిగి వైపు వెళ్తున్న లారీ వీరిని ఢీకొట్టింది. ఆయేషా అక్కడికక్కడే మృతి చెందగా, రెహనాబేగం స్వల్పగాయాలతో బయటపడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. అంబేడ్కర్ చౌరస్తాలోని నాలుగు రహదారుల్లో అతివేగాన్ని అదుపు చేయడానికి పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.


