● వారం రోజులుగా నిలిచిన సరఫరా
● పంచాయతీ ట్యాంకరే దిక్కు
● వేసవితాపానికి అల్లాడుతున్న
పుర్సంపల్లివాసులు
సమస్యను పరిష్కరించాలి
గ్రామంలో మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో పొలం దగ్గరకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సి వస్తుంది. అధికారులకు ఫోన్లు చేసి నా స్పందించడం లేదు. స్థానిక అధికారులకు విషయం చెప్తే ట్యాంకరును ఏర్పాటు చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించాలి.
– ఎర్రం శ్రీనివాస్, గ్రామస్తుడు, పుర్సంపల్లి
కుల్కచర్ల: వేసవి తాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. చౌడాపూర్ మండలం పుర్సంపల్లి గ్రామంలో వారం రోజులుగా తాగునీటి ఎద్దడి కలవరపాటుకు గురి చేస్తోంది. నెలరోజుల నుంచి మిషన్ భగీరథ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. వేసవి నేపథ్యంలో గ్రామంలోని బోర్లు సైతం పాడైపోవడంతో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ట్యాంకరు ఒక్కటే దిక్కుగా మారింది.
కానరాని భగీరథ అధికారులు
ప్రస్తుతం వేసవి నేపథ్యంలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాల్సిన మిషన్ భగీరథ అధికారులు ఎక్కడా కనిపించడంలేదు. ఫోన్ చేసినా స్పందించడం లేదని మండలప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి పరిస్థితులను ముందస్తుగా అంచనా వేసి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా చర్యలు కరువయ్యాయి. కనీసం గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందనే విషయాన్ని సైతం గ్రహించడంలేదని గ్రామస్తుతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పాడైన పోయిన బోర్లు
మిషన్ భగీరథ నీరు రాకపోవడం అదేవిధంగా గ్రామంలోని జీపీ బోర్లు పాడవటంతో గ్రామస్తుల ఇబ్బంది మరింత తీవ్రంగా మారింది. తాగేందుకు గ్రామానికి వచ్చే ఫిల్టర్ నీరు తీసుకుంటూ.. అవసరాలకు సమీప పొలాల వెంబడి వెళ్లి నీరు తెచ్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఒక ట్యాంకరు ఏర్పాటు చేసినా అది కొంతమేరకు ఉపశమనం కలిగిస్తుందని స్థానికులు తెలుపుతున్నారు. దాని కోసం మహిళలు కుస్తీలు పట్టుకునే దుస్థితి నెలకొంది.


