ప్రశాంతంగా అసెస్మెంట్ టెస్ట్
అనంతగిరి: ఉల్లాస్ అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడుతున్న ఎఫ్ఎల్ఎన్ఏటీ(ఫండమెంటల్ లిట్రసీ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్) ఎన్ఐఓఎస్ పరీక్షను ఆదివారం జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షను సెర్ప్, మెప్మా, ఎస్హెచ్జీ సంఘాలు మహిళా సంఘాల సభ్యుల కోసం చేపట్టారు. జిల్లాలో విద్యాశాఖ, డీఆర్డీఓ, మెప్మా, సెర్ప్ అధికారుల సమన్వయంతో పరీక్షను నిర్వహించారు. మొత్తం 566 పరీక్ష కేంద్రాల్లో 20,451 మంది అభ్యాసకులు నమోదు కాగా వారిలో దాదాపు 16 వేల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో అక్షరాస్యత పెంపొందించమే లక్ష్యమని, ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి 3వ తరగతి సమాన స్థాయి సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. నూతన అక్షరాస్యులుగా గుర్తించబడుతారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని వయోజన విద్యా జిల్లా ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్ తెలిపారు.
చిలుకూరు బాలాజీకి వాహన సేవలు
మొయినాబాద్: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం బాలాజీ స్వామి గోప వాహన, హనుమంత వాహన సేవలు అందుకున్నారు. చిలుకూరు బాలాజీ దేవాలయం బ్రహ్మోత్సవాలు మూడు రోజులుగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారిని మొదటగా గోపవాహనంపై, తరువాత హనుమంత వాహనంపై ఆసీనులను చేసి ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా వేదపారాయణం, పూజలు, మంగళహారతి సేవలు అందించారు. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాల కృష్ణస్వామి, అర్చకులు రంగరాజన్, తిరుమల కిరణాచారి, నరసింహన్, కిట్టు, కృష్ణమూర్తి, మురళి, కన్నయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


