కౌన్సిలర్లు!
వికారాబాద్: పుర పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో నేతల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. నేడు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఆయా పార్టీల అభ్యర్థులు.. స్వతంత్రులు గెలుపోటములపై లెక్కలు వేసుకుంటున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి కొన్ని చోట్ల ఓటింగ్ శాతం పెరగ్గా.. మరికొన్ని చోట్ల తగ్గింది. ఈ ప్రభావం ఎవరికి లాభిస్తుందో..? ఎవరికి నష్టం చేకూరుస్తుందోనని ఆందోళన చెందుతున్నా రు. పోలింగ్ సరళిని బట్టి ఏయే వార్డుల్లో లీడ్ వస్తుంది.. ఎక్కడ వెనుకబడి పోతున్నామనే దానిపై అభ్యర్థులు, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సమీక్షించినట్లు సమాచారం. జిల్లాలో నాలుగు పురపాలికలు ఉండగా రెండింటిలో అధికార పార్టీ గెలుపు నల్లేరుపై నడకేనని భావిస్తోంది. మరో రెండింటిలో పోటీ గట్టిగా కనిపిస్తోంది. ప్రతి పక్ష బీఆర్ఎస్ తోపాటు అధికార కాంగ్రెస్ నేతలు కూడా ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉండగా.. వికారాబాద్, తాండూరు మేజర్ కాగా, పరిగి, కొడంగల్ చిన్నవి. వీటి పరిధిలో వంద వార్డులు ఉండగా.. 341 మంది పోటీ చేశారు. అభ్యర్థులు వార్డులు, కాలనీల వారీగా ముఖ్య నాయకులు, అనుచరులను పిలిపించుకొని ఓటింగ్ సరళిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఏ వార్డులో ఏయే కాలనీలో ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయి, ఎవరికి తక్కువ వస్తాయి అనే విషయాలు తెలుసుకున్నట్లు సమాచారం. 2020 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఓటింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. ఇది ఎవరికి లాభిస్తుందోననే కోణంలో కూడా బేరీజు వేసుకుంటున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్య అనుచరుల నుంచి సేకరించిన సమాచారమే కాకుండా పలు సంస్థలు చేసిన సర్వే ఫలితాలపై పలువురు అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. పోలింగ్ రోజు, అంతకుముందు కూడా అభ్యర్థులు, పార్టీలు ప్రైవేటుగా సర్వే చేయించుకున్నాయి.
ఓ వైపు గెలుస్తామని పైకి ధీమాగా చెబుతున్నా లోపలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవ పరిస్థితిని దాచిపెట్టి మనమే గెలుస్తున్నామంటూ పార్టీ ముఖ్యలు చెబుతుండటం, ఇతరుల ద్వారా తెలుసుకున్న సమాచారం ఇందుకు భిన్నంగా ఉండటంతో అభ్యర్థులు టెన్షన్కు గురవుతున్నారు.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కలెక్టర్ ప్రతీక్జైన్, అడిషనల్ కలెక్టర్ సుధీర్ పర్యవేక్షిస్తున్నారు. కొడంగల్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, పరిగిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(నంబర్ వన్)లో, వికారాబాద్లోని శ్రీ అనంతపద్మనాభ కళాశాలలో, తాండూరులోని సేయింట్ మార్క్స్బీ స్కూల్లో కౌంటింగ్ చేయనున్నారు. కొడంగల్ మున్సిపల్ పరిధిలో 12 వార్డులు ఉండగా ఆరు టేబుళ్లు ఏర్పాటు వేసి రెండు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. పరిగిలో 18 వార్డులు ఉండగా ఆరు టేబుళ్లు ఏర్పాటు చేసి మూడు రౌండ్లలో ప్రక్రియను పూర్తి చేస్తారు. వికారాబాద్లో 34 వార్డులు ఉండగా రెండు వార్డులు ఏకగ్రీవం కాగా 32 వార్డుల్లో పోలింగ్ జరిగింది. 12 టేబుళ్లు వేసి మూడు రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేయనున్నారు. తాండూరులో 36 వార్డులు ఉండగా 12టేబుళ్లు వేసి మూడు రౌండ్లలో ఓట్ల లెక్కిస్తారు.
సర్వం సిద్ధం
పోటీలో 341 మంది
గెలుస్తామంటూనే..
కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి
పటిష్ట భద్రత నడుమ..
తాండూరు: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణంలోని సెయింట్ మార్క్స్ జూబ్లీ స్కూల్లో ఓట్ల లెక్కించనున్నారు. మున్సిపల్ పరిధిలో 36 వార్డులు ఉండగా 135 మంది తలపడ్డారు. 12 మంది ఎన్నికల రిటర్నింగ్ అధికారులు విధుల్లో ఉంటారు. 12 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 60 మంది సిబ్బంది మూడు విడతల్లో ఓట్లు లెక్కిస్తారు. ఒక్కో టేబుల్కు ఇద్దరు ఆర్ఓలు, ఏఆర్ఓలు, ముగ్గురు కౌంటింగ్ సిబ్బంది ఉంటారు. ప్రతి రౌండ్లో 12 వార్డుల ఫలితాలు వెల్లడిస్తారు.
పరిగి: పట్టణంలోని నంబర్ వన్ ఉన్నత పాఠశాలలో మున్సిపల్ కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒక్కో రౌండ్లో ఆరు వార్డుల ఫలితాలు వస్తాయని కమిషనర్ వెంకటయ్య తెలిపారు. మొత్తం 24 మంది సిబ్బంది విధుల్లో ఉంటారని.. ప్రతి టేబుల్కు ఒక సూపర్వైజర్లు, ఓట్ల లెక్కింపునకు ఇద్దరు సిబ్బంది, ఆర్ఓ విధుల్లో ఉంటారని చెప్పారు. 135 పోస్టల్ బ్యాలెట్లకు గాను 109 మంది ఉద్యోగులు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. ముందుగా వీటినే లెక్కిస్తారు.
పుర పోరులో విజేతలెవరో..
బ్యాలెట్ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం
పైకి ధీమా.. లోపల గుబులు
ఎవరి లెక్కలు వారివే
పార్టీల వారీగా సమీక్షలు
నేడే కౌంటింగ్.. ఏర్పాట్లు పూర్తి