భూసేకరణ.. ఆందోళన!
యాచారం: భూసేకరణ అన్నదాతల్లో కంటికి కునుకు లేకుండా చేస్తోంది. ఫ్యూచర్సిటీ, హైస్పీడ్ రైల్, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణాల పేరుతో ఎప్పుడు.. ఏ గ్రామంలోని భూమిని సేకరిస్తుందోనని ఆందోళనతో కాలం వెల్లదీస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీకి యాచారం, కందుకూరు, కడ్తాల్ మండలాల్లో 19,333 ఎకరాల అసైన్డ్, పట్టా భూమి సేకరించడానికి నిర్ణయించి 14,500 ఎకరాలు సేకరించారు. ప్రస్తుతం ఆ భూముల్లోనే కాంగ్రెస్ సర్కార్ ఫ్యూచర్సిటీ నిర్మాణానికి సంకల్పించింది. మరో నాలుగు వేల ఎకరాల భూమి పరిహారం అథారిటీలో జమ చేయడం, కోర్టు కేసులతో వివాదం నెలకొంది. ఏళ్లుగా భూములను నమ్ముకుని జీవనోపాధి పొందుతున్న రైతులకు భూసేకరణతో ఉపాధి కోల్పోతామనే భయం పట్టుకుంది.
అనువైన భూములు ఉన్నందునే..
ఫ్యూచర్సిటీకి యాచారం మండలంలోనే అనువైన భూములున్నట్లు అధికారులు గుర్తించారు. మండలంలోని కొత్తపల్లి, తక్కళ్లపల్లి, చింతుల్ల, నందివనపర్తి, మొండిగౌరెల్లి, చింతపట్ల, నల్లవెల్లి తదితర గ్రామాల్లో ప్రభుత్వ, అసైన్డ్ భూములు అధికంగా ఉండడం భూ సేకరణకు కలిసొస్తోంది. ఇప్పటికే మొండిగౌరెల్లిలో 822 ఎకరాల అసైన్డ్, పట్టా భూముల సేకరణకు నోటిఫికేషన్లు వేయగా, కొత్తపల్లిలో 2,200 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూమి సేకరణకు సర్వే చేసి, హద్దులు పాతి, గ్రామసభ ఏర్పాటు చేశారు. నందివనపర్తిలోని దేవాలయానికి చెందిన 1,100 ఎకరాల భూమిని సేకరించడానికి నిర్ణయించారు. యాచారం, చింతుల్ల, నల్లవెల్లి, చింతపట్ల తదితర గ్రామాల్లో మరో పది వేల ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ భూమిని సేకరించడానికి అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
822 ఎకరాల అసైన్డ్, పట్టా భూమితో పాటు డీటీసీపీ వెంచర్ చేసిన భూమికి నోటిఫికేషన్ వేశారు. ఇంత వరకు పరిహారం తేల్చ లేదు. –కోలన్ మల్లారెడ్డి, రైతు, మొండిగౌరెల్లి
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ముందుకు వెళ్తున్నాం. పరిహారం ఇచ్చే అంశం సర్కార్ పరిధిలో ఉంటుంది.
– అయ్యప్ప, తహసీల్దార్, యాచారం
అసైన్డ్, పట్టా భూముల సేకరణపై సర్కార్ నజర్
ఫ్యూచర్సిటీ, హైస్పీడ్ రైల్, గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కోసం..
కంటికి కునుకు లేకుండా గడుపుతున్న రైతులు


