స్పీకర్ ప్రసాద్ కుమార్
అనంతగిరి: సమాజ సేవలో ముందుండే వీరశైవ సమాజానికి తన వంతు సహకారం ఉంటుందని స్పీకర్ ప్రసాద్ కుమార్ అన్నారు. శ్రీ జగజ్యోతి బసవేశ్వర విద్యాసంస్థ ఆధ్వర్యంలో ఎన్నేపల్లిలో కొత్తగా నిర్మించిన వీరశైవ బసవ భవనాన్ని శుక్రవారం ఆలంపల్లి కెంపిన, దుద్దిని పీఠాధిపతి డాక్టర్ చెన్న బసవప్రభు స్వామి, మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య, జహీరాబాద్ మాజీ ఎంపీ బీబీ పాటిల్, విద్యా సంస్థ బాధ్యులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వీరశైవ సమాజం ఆధ్వర్యంలో నిర్వహించే ధార్మిక, ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలకు తన వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. సమాజానికి ఉపయోగపడే విధంగా బసవ భవనాన్ని నిర్మించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం విద్యాసంస్థ అధ్యక్షుడు ఎన్.బస్వరాజ్ మాట్లాడుతూ.. బసవేశ్వరుడి బోధనలు, ఇతర ఆధ్యాత్మిక విద్యతో పాటు ఆధునిక విద్యను ప్రాంత వాసులకు చేరువ చేయాలనే ఉన్నత లక్ష్యంతో ఈ విద్యా సంస్థ ఏర్పాటైందన్నారు. అంతకుముందు వీరశైవ ఆగమ పండితులు మఠాధిపతి సాంబశివశర్మ, బస్వరాజ్ స్వామి, విశ్వేశ్వర్, మఠం చంద్రశేఖర్, పులుమద్ది మల్లేశం, పార్వతయ్య స్వామి ఆధ్వర్యంలో మహా రుద్రాభిషేకం తదితర వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. బసవ భవన నిర్మాణానికి విరాళాలు అందజేసిన వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యుడు ఆకుల మహేష్ కుమార్, విద్యాసంస్థ బాధ్యులు విజయకుమార్, వీరేశం, శుభప్రద్ పటేల్, ఆత్మలింగం, వీరన్న, సంపూర్ణ ఆనంద్, సంగప్ప, శివకుమార్, సమాజం బాధ్యులు విద్యాసాగర్, విజయకుమార్, భద్రప్ప తదితరులు పాల్గొన్నారు.


