
అమ్మానాన్నకు దూరమై..చదువులమ్మకు దగ్గరై..
● ఎంబీబీఎస్ సీటు సాధించిన
నిరుపేద విద్యార్థి
● చిన్నాన్న, చిన్నమ్మ
సహకారంతో ముందుకు
● డాక్టర్ అయి.. ప్రజాసేవలో తరిస్తా: వంశి
కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం చేగిరెడ్డి ఘనాపూర్ గ్రామానికి చెందిన వెన్నశెట్టి మంజుల, జంగయ్య దంపతులకు వంశీకృష్ణ, నందిని ఇద్దరు సంతానం. వీరిద్దరు మూడేళ్లలోపు ఉన్నప్పుడే కన్నవారు దూరం కాగా.. అన్నా, చెల్లెలు అనాథలుగా మిగిలారు. వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఆ సమయంలో ఆ చిన్నారులను చిన్నాన్న బీమయ్య, చిన్నమ్మ యాదమ్మ దంపతులు అక్కున చేర్చుకున్నారు. ఆదర్శంగా తీర్చిదిద్దారు.
చేరదీసినందుకు.. ఉన్నతంగా..
వంశీకృష్ణ, నందినిని స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 4వ తరగతి వరకు చదివించారు. ఆ తరువాత ఇద్దరు గురుకుల పాఠశాలకు ఎంపికై ఉన్నత చదువులు పూర్తిచేశారు. వంశీకృష్ణ గౌలిదొడ్డి గురుకుల కళాశాలలో ఇంటర్లో 920 మార్కులు సాదించాడు. ఆపై నీట్ ప్రవేశ పరీక్ష రాసి 407 మార్కులతో నాగర్కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సంపాదించాడు. అన్నను ఆదర్శంగా తీసుకున్న చెల్లెలు నందిని.. షాద్నగర్ పట్టణంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఇంటర్ పూర్తిచేసి, నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.
ఎవరినీ మరువను.. వంశి
తల్లిదండ్రులను కోల్పోయిన మమ్మల్ని చిన్నాన్న, చిన్నమ్మలు చేరిదీసి కన్నబిడ్డలా చూసుకున్నారు. వారి కష్టాన్ని వృథా కానీయకుండా గుర్తింపు తెచ్చుకున్నాను. అండగా నిలిచిన వారిని మరువను. డాక్టర్ను అయి.. పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తాను.
బతుకు బాటను చూపించారు
అమ్మానాన్న పోవడంతో మా చిన్నాయన, చిన్నమ్మలు చేరదీసి చదివించారు. నాడు ఉపాధ్యాయులు శివాజీ, వెంకట్రావు మమ్మల్ని బాగా చూసుకున్నారు. పాఠాలు చెప్పడమే కాదు.. బతుకు బాటను చూపించారు. వారి స్ఫూర్తితోనే ఉన్నతంగా చదువుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నదే నా తపన.
– నందిని
ఆర్థికంగా అండగా ఉంటా
వంశీకృష్ణ మెడికల్ సీటు సాధించగానే.. అండగా ఉంటామంటూ దాతలు ముందుకు వచ్చారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విద్యార్థిని శాలువాతో సత్కరించి, ఆర్థికంగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు కృష్ణ రూ.25 వేలు అందజేశారు. బీఆర్ఎస్ నాయకుడు చందునాయక్ రూ.11 వేలు ఇచ్చారు. మరికొందరు తాము సైతం అంటున్నారు.

అమ్మానాన్నకు దూరమై..చదువులమ్మకు దగ్గరై..

అమ్మానాన్నకు దూరమై..చదువులమ్మకు దగ్గరై..