తిరుపతి రూరల్: చిన్నారుల విద్యారంభాన్ని శ్రీ వేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో మంగళప్రదంగా ప్రారంభించే లక్ష్యంతో టీటీడీ హిందూ ధర్మ ప్రచారపరిషత్ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ‘అక్షర గోవిందం–అన్నప్రాసనం’ కార్యక్రమం శుక్రవారం తిరుపతి శివారులోని శ్రీ వకుళామాత ఆలయంలో ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఎం.రవిచంద్ర పాల్గొని చిన్నారులు ఆశీర్వదించారు. అనంతరం చిన్నారులకు ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత ‘అక్షర గోవిందం కిట్’లను ఉచితంగా పంపిణీ చేశారు. అమ్మవారి సన్నిధిలో తయారైన ప్రసాదాలతో పలువురు చిన్నారులకు అన్న ప్రాసనం నిర్వహించారు.
తిరుపతిలో సంస్కృత అకాడమీ
తిరుపతి సిటీ: తిరుపతిలో సంస్కృత అకాడమీ ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని, స్థలం కోసం టీటీడీకి లేఖ రాశామని తెలుగు, సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డీ విల్సన్ శరత్చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం ఎస్వీ గోశాల వద్దగల తెలుగు, సంస్కృత అకాడమీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అకాడమీ ద్వారానే విద్యార్థులకు టెక్ట్స్ పుస్తకాలు సరఫరా ఉంటుందని, ప్రైవేటు సంస్థలు సైతం అకాడమీ పుస్తకాలనే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. తమిళనాడు తరహాలో వర్చువల్ అకాడమీ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రి ఆదేశాల మేరకు డీపీఆర్ తయారు చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో తెలుగు అకాడమీ చైర్మన్గా ఉన్న లక్ష్మీపార్వతి చేసింది ఏమీ లేదన్నారు.


