తిరుపతి అర్బన్: పులికాట్ సమస్యకు పరిష్కారం చూపుదామని తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, తిరువళ్లూరు కలెక్టర్ ప్రతాప్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దులోని పులికాట్ సరస్సు జలాల్లో రెండు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారుల మధ్య నిత్యం ఘర్షణలు చోటుచేసుకుంటున్న అంశంపై తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్, తిరువళ్లూరు కలెక్టర్ ప్రతాప్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్లో సమీక్షించారు. ఇరు జిల్లాల ఎస్పీలతోపాటు డీఆర్వోలు, ఆర్డీవోలు సమీక్షలో పాల్గొన్నారు. ఈనెల 6వ తేదీన తమిళనాడులోని గుమ్మిడిపూడి తహసీల్దార్ కార్యాలయంలో రెండు జిల్లాలకు చెందిన కలెక్టర్లు, ఎస్పీలతోపాటు ఇరు వైపుల నుంచి ముగ్గురు చొప్పున ప్రజా ప్రతినిధులు, మత్స్యకారులు, పోలీస్, రెవెన్యూ, మత్స్యశాఖాధికారుల సమక్షంలో శాంతి చర్చలు నిర్వహించనున్నారు. అలాగే పులికాట్ సరస్సులో జాయింట్ సర్వే చేసి స్పష్టమైన హద్దులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లు చర్చించుకున్నారు.
నేటి నుంచి యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్
తిరుపతి అర్బన్: నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ నేతృత్వంలో యాంటీ టెర్రరిస్ట్ మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని మంగళవారం నుంచి గురువారం వరకు చేపట్టనున్నారు. ఆ మేరకు కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేశ్వర్తోపాటు ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ, ఎన్ఎస్జీ మేజర్ సంతోష్రెడ్డి, డీఆర్వో నరసింహులు, పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక, వైద్య ఆరోగ్య, రవాణా శాఖలకు చెందిన వారితో నిర్వహణకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమాన్ని అక్టోపస్ దళాలు, ఎన్ఎస్జీ బృందాలు సంయుక్తంగా చేపట్టాల్సి ఉందని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులను వాస్తవంగా భావించి ప్రతి చర్యలు చేపట్టడానికి అవలంబించాల్సిన అంశాలను విశిదీకరించారు. మంగళవారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద, బుధ, గురు వారాలు తిరుమలలోని శ్రీపద్మావతి అతిథి గృహం, శ్రీవారి ఆలయం వద్ద మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు తెలిపారు.


