
దోచుకోవడం.. దాచుకోవడం
ప్రకృతి వనరులను కొల్లగొడుతున్న కూటమి నేతలు అభివృద్ధిని గాలికివదిలేసిన ప్రభుత్వం మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి
చిల్లకూరు : రాష్ట్రాభివృద్ధిని ప్రభుత్వం గాలికి వదిలేసిందని, కూటమి నేతలు ప్రకృతి వనరులను దోచుకోవడం, దాచుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి ఆరోపించారు. సర్కారు అక్రమంగా పెట్టిన కేసుల్లో చిక్కుకుని విడుదలైన వేమారెడ్డి కుమారస్వామిరెడ్డి, వారి తల్లి శారదమ్మను ఆయన పరామర్శించారు. ఆదివారం ఈ మేరకు చిల్లకూరు మండలం మోమిడి గ్రామానికి వెళ్లారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రశాంతమైన ఉమ్మడి నెల్లూరు జిల్లాను అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చేశారని మండిపడ్డారు. జిల్లాలో రోజూ ఎక్కడో ఓ చోట హత్యలు, దాడులు, గంజాయి విక్రయాలు సాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గతంలో సిలికాలో దోపిడీ జరుగుతోందని గగ్గోలు పెట్టారని, ఇప్పుడు ఆయనే కోట మండలం కర్లపూడిలో సిలికా మైన్లు తీసుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. దీన్ని అడ్డుపెట్టుకుని సమీపంలోని ఏపీఐఐసీ భూముల్లో సైతం సిలికాను తవ్వేసి అమ్మేసుకునేందుకు పథకం వేశారని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో తిరుపతి, నెల్లూరు జిల్లాలు గ్రావెల్, మట్టి, సిలికా, ఇసుక దోపిడీకి కేంద్రాలుగా మారినట్టు వెల్లడించారు. నేరుగా ప్రజా ప్రతినిధులే రంగంలోకిదిగి, ఇసుకను తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. అడ్డుకునేందుకు యత్నించిన వైఎస్సార్సీపీ నేతలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కొందరిపై అన్యాయంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారన్నారు. అక్రమంగా రౌడీ షీట్ నమోదైన వారు తన వద్దకు గానీ, ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తల దృష్టికి గానీ తీసుకురావాలని కోరారు. అక్రమ కేసులు పెట్టిన వారిపై ప్రైవేట్ కేసులు వేసేందుకు వెనుకాడమని హెచ్చరించారు. కొత్తగా వచ్చిన ఎస్పీ సుబ్బారాయుడు పోలీస్ వ్యవస్థను గాడిలో పెట్టి, అక్రమ కేసులు బనాయించకుండా చూడాలని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, వైస్సార్సీపీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, నేతలు నల్లపరెడ్డి రజిత్రెడ్డి పాల్గొన్నారు.