భార్యాపిల్లల కాళ్లూ చేతులూ కట్టేసి.. సంపులో పడేసి.. | Wanaparthy Tragedy Debt Pressure Suspected in Family Death Case | Sakshi
Sakshi News home page

భార్యాపిల్లల కాళ్లూ చేతులూ కట్టేసి.. సంపులో పడేసి..

May 28 2026 7:26 AM | Updated on May 28 2026 7:37 AM

Wanaparthy Tragedy Debt Pressure Suspected in Family Death Case

వనపర్తి: సొంతింటి కల ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ఇంటి నిర్మాణం కోసం అప్పులు పెరిగిపోయి నిండా మునిగిపోవడం.. అప్పుల వాళ్ల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి కుటుంబంతో సహా తనువు చాలించాడు. నిండా 15 ఏళ్లు కూడా లేని ఇద్దరు పిల్లలతోపాటు భార్య కాళ్లూ చేతులు కట్టేసి సంపులో పడేశాడు. అనంతరం ఉరి వేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.

 ఈ విషాదకర సంఘటన వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని సల్కెలాపూర్‌ శివారులో చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలంలోని డోకూరు గ్రామానికి చెందిన నర్సింహులు(40) మామిడి తోటలు కౌలుకు తీసుకుని జీవనం సాగిస్తున్నాడు. స్వగ్రామంలో సొంతింటి నిర్మాణం కోసం ఓ ఫైనాన్స్‌ కంపెనీలో రుణంతో పాటు తెలిసిన వారి దగ్గర కలిపి మొత్తం 70 లక్షల వరకు అప్పులు చేశాడు. గత నాలుగేళ్ల నుంచి వనపర్తి జిల్లా సల్కెలాపురంలో మామిడితోట కౌలుకు తీసుకుని కుటుంబంతో కలిసి అక్కడే ఉంటున్నాడు.

 అయితే ఫైనాన్స్‌ కంపెనీతో పాటు బయట తీసుకున్న అప్పులకు వడ్డీలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో అప్పులవాళ్ల నుంచి ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. ఫైనాన్స్‌ కంపెనీ కూడా ఈ విషయంలో తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. అటు అప్పులు తీర్చే మార్గం లేక, ఇటు వేధింపులు తాళలేక తీవ్ర మనస్తాపానికి గురైన నర్సింహులు దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో భార్య ఎల్లమ్మ(36), కుమారుడు నిహాల్‌(15), కూతురు సాహితీశ్రీ(13)ల కాళ్లూ చేతులూ కట్టేసి తోటలోని సంపులో పడేశాడు. వారు చనిపోయిన తర్వాత సెల్ఫీ వీడియో తీసుకుని కంటైనర్‌ గృహానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  

సెల్ఫీ వీడియోకు ముందు.. 
నర్సింహులు ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అనంతరం తన అక్క కుమారుడు దర్శెళ్లికి తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో కాల్‌ చేశాడు. గద్వాలలో ఉండే దర్శెళ్లి కుటుంబ సభ్యులందరికీ సమాచారం ఇచ్చాడు. దీంతో కంగారుపడి.. వారు పోలీసులకు సమాచారం ఇచ్చి సల్కెలాపురానికి బయలుదేరారు. అయితే, తాము వచ్చేసరికే సంపులో ముగ్గురి మృతదేహాలు, కంటైనర్‌ గృహానికి నర్సింహులు మృతదేహం వేలాడుతూ కనిపించిందంటూ రోదిస్తూ చెప్పారు. అప్పటికే తోట పక్కన పొలాల వారు కూడా ఈ విషయం గమనించి ఒకరికొకరు సమాచారం చేరవేసుకోవడంతో గ్రామంలో ప్రజలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి ఉదయం 8.30 గంటలకు చేరుకున్న పోలీసులు మృతదేహాలను మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు.

సెల్ఫీ వీడియోలో ఏముందంటే..?
‘‘అప్పుల బాధ తట్టుకోలేక సూసైడ్‌ చేసుకోవాలని అనుకుంటున్న. నా వల్ల కావడంలేదు. ఇంజక్షన్‌ ఆర్డర్‌ తీసుకున్నా కూడా ఎవరూ వినడంలేదు. గద్వాల నుంచి ఒత్తిడి ఎక్కువైంది. ర్యాంబో, వెంకటమ్మ, రేణుకలకు మూడేళ్లు మిత్తి కట్టినా.. అసలు కట్టినా.. మిత్తి కోసం టార్చర్‌ చేస్తున్నారు. అప్పుల కోసం గ్రామంలో ఇబ్బంది పెడుతున్నారు. ఓ లాయర్‌ నన్ను ఐపీ పెట్టమంటే.. అప్పులు కడతానని వద్దని నేనే చెప్పిన. మహబూబ్‌నగర్‌లో మరో లాయర్‌ వద్దకు వెళితే.. ఆయన స్నేహితుడికి సంబంధించిన అప్పు కట్టు.. మిగతావారి సంగతి తర్వాత అన్నాడు. 

ఫ్యామిలీ అంటారు.. పుట్టినప్పుడే అన్నదమ్ములు, అక్కా తమ్ముడు మామిడి తోటలు పట్టుకుని లాస్‌ అయ్యాను. 150 ఎకరాలు కౌలు తీసుకుని 20 మంది జీతగాళ్లతో నడిపినా ఎవరికీ అన్యాయం చేయలేదు ఎలాంటి అలవాట్లు లేవు. పిల్లలను చంపుకుని.. నేను చచి్చపోతున్న.. ఒకడు బొలెరోతో గుద్ది సంపుతా అని, ఇంకోడు తీసుకుపోయి రైలు కింద వేస్తా అన్నాడు. నేను అప్పు కట్టకుంటినా.. నా లాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు’’అని నర్సింహులు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు.  

 

Advertisement
 
Advertisement
Advertisement