
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడి
ఏపీ ఈ రెండు ప్రాజెక్టులు అక్రమంగా నిర్మిస్తోంది
వీటివల్ల రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులకు, తాగునీటికి ముప్పు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా నదులపై అక్రమంగా నిర్మిస్తున్న బనకచర్ల, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం (ఆర్ఎల్ఐ)లపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం నీటి ఒప్పందాల ఉల్లంఘననేనని అన్నారు.
వీటివల్ల తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు, తాగునీటికి పెను ప్రమాదం పొంచి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టులను అడ్డుకునేలా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు గాను న్యాయ నిపుణులు, సాగునీటి శాఖ స్టాండింగ్ కౌన్సిల్స్తో పాటు అడ్వొకేట్ జనరల్తో త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు. శుక్రవారం జలసౌధలో సాగునీటి శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడారు.
నిబంధనలు ఉల్లంఘించి ‘బనకచర్ల’, ఆర్ఎల్ఐ
ఈ రెండు ప్రాజెక్టులపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు. వేగవంతమైన, సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని, ఎలాంటి జాప్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సంబంధిత నియంత్రణ సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఉపక్రమించిందని చెప్పారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటాను రక్షించేందుకు సుప్రీంకోర్టులో గట్టిగా కొట్లాడతామన్నారు.
గోదావరి నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ (జీడబ్ల్యూడీటీ) చేసిన పంపకాలతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని నిబంధనలను కూడా బనకచర్ల ప్రాజెక్టు ఉల్లంఘిస్తోందని, కేంద్ర జల సంఘం, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ల నుంచి రావాల్సిన అనుమతులు కూడా రాలేదని చెప్పారు.
ఆర్ఎల్ఐ పథకం విషయంలోనూ పర్యావరణ నిబంధనలు, నీటి నిల్వ తదితర విషయాల్లో ఉల్లంఘనలు జరుగుతున్నాయని మంత్రి చెప్పారు. అయితే తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కోరిన అనంతరం నిపుణుల కమిటీ ఈ పథకం పనులు నిలిపివేయాలని ఆదేశించిందని, అయినా ఏపీ ప్రభుత్వం ఇతర రూపాల్లో ప్రాజెక్టు పనులను కొనసాగిస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు.
దానివల్ల భద్రాచలానికీ ప్రమాదం
గోదావరి వరదను రాయలసీమకు తరలించడం ద్వారా టెంపుల్ సిటీ అయిన భద్రాచలానికి కూడా ప్రమాదం పొంచి ఉందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. వరదలు సహజంగా ప్రవహించే స్థితి కోల్పోయేలా ఏపీ ప్రభుత్వం ముందుకెళుతోందని, భద్రాచలం చుట్టూ గోడ కట్టడం ద్వారా వరదల నుంచి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం రాకుండా కేంద్ర సాయాన్ని కోరతామని తెలిపారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో పూడికను తొలగించే పనులకు త్వరలోనే టెండర్లు పిలవాలని, ప్రతి నీటి చుక్కను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలన్నీ చేపడతామని చెప్పారు. సమీక్షలో సాగునీటి శాఖ ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు.