‘సర్‌’ పేరిట మీకు నోటీసు వస్తే.. | Telangana SIR: Why will 92 lakh electors receive notices? | Sakshi
Sakshi News home page

‘సర్‌’ పేరిట మీకు నోటీసు వస్తే..

Aug 20 2026 11:24 AM | Updated on Aug 20 2026 11:28 AM

Telangana SIR: Why will 92 lakh electors receive notices?

సాక్షి, హైదరాబాద్‌: ఓటరు ముసాయిదా జాబితా విడుదలైంది. అందులో చాలామంది తమ పేర్లు కనిపించడం లేవంటున్నారు. ముసాయిదాలో పేర్లున్నా, చాలామందికి నోటీసులు వస్తాయని, వాటికి వివరణ ఇస్తేనే తుది జాబితాలో పేరుంటుందని, లేని పక్షంలో ఉండదని చెబుతున్నారు. ముసాయిదాలో పేర్లున్న వారు తమ పేరు, ఎపిక్‌నెంబరు, వయసు, చిరునామా, పోలింగ్‌ కేంద్రం తదితర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో పరిశీలించుకుంటే మంచిది. పొరపాట్లు దొర్లితే సవరణకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

ఏఎస్‌డీ/అన్‌ కలెక్టబుల్‌ అంటే.. 
ఏఎస్‌డీ, అన్‌ కలెక్టబుల్‌గా, డూప్లికేట్లుగా పేర్కొంటూ హైదరాబాద్‌ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19,41,444 మంది పేర్లు తొలగించారు. ఇళ్లలో లేనివారు, చిరునామా మారిన వారు, మరణించిన వారిని సంక్షిప్తంగా ఏఎస్‌డీగా చెబుతున్నారు. ఒక చోటు కంటే ఎక్కువ చోట్ల ఓట్లున్నవారిని  డూప్లికేట్లుగా పేర్కొంటున్నారు. 

అలాంటి వారికి ఒక్కచోట మాత్రం ఉంచి మిగతా చోట్ల తొలగించినట్లు పేర్కొన్నారు. ఇందులో ఎవరి పేరైనా పొరపాటున తొలగించి ఉంటే, వారు మళ్లీ తాజాగా ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవాలి. 

నో మ్యాపింగ్, అనామలీస్‌ అంటే.. ఏమిటో తెలియక చాలామంది  గందరగోళానికి గురవుతున్నారు. జిల్లాలో నో మ్యాపింగ్‌ కేటగిరీలో 5.80 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.  ఎన్యూమరేషన్‌ ఫారంలో అడిగిన 2002 ఓటర్ల జాబితా(గత ‘సర్‌’)లోని  స్వీయ లేదా రక్తసంబం«దీకుల వివరాలు భర్తీ చేయని వారిని నో  మ్యాపింగ్‌ కేటగిరీలో చేర్చారు. ఈ వివరాలను భర్తీ చేసినప్పటికీ, అవి వాస్తవ విరుద్ధంగా, అసంగతంగా ఉన్న వాటిని అనామలీస్‌గా  అధికారులు తెలిపారు. 

  • అంటే తోబుట్టువుల మధ్య వయసు తేడా 9 నెలల కంటే తక్కువగా ఉండటం, తల్లిదండ్రులు– సంతానం మధ్య వయసు తేడా 50 ఏళ్లకన్నా ఎక్కువ ఉండటం, పాత సర్‌ జాబితాలో తల్లిదండ్రుల పేర్లకు, ఇప్పుడు పేర్కొన్న పేర్లకు మధ్య తేడాలుండటం, తల్లిదండ్రులు– సంతానం మధ్య వ్యత్యాసం 15 ఏళ్లకన్నా తక్కువ ఉండటం, గతంలో భర్త పేరు పేర్కొన్న వారు ఇప్పుడు తండ్రి పేరు పేర్కొనడం  గత సర్‌తో పోలిస్తే వయసులో వ్యత్యాసం.. ఇలా వివిధ కారణాలతో వాస్తవాలకు విరుద్ధంగా కనిపిస్తున్న వాటిని ఈ కేటగిరీలో  చేర్చారు. ఇలాంటి వారు కూడా హైదరాబాద్‌ జిల్లాలో 6.70 లక్షల మందికి పైగా ఉన్నారు.  ఇలాంటి వారందరికీ బీఎల్‌ఓల ద్వారా నోటీసులందుతాయని తెలిపారు.  

    నో మ్యాపింగ్‌ జాబితాలోని వారు పుట్టిన తేదీ (వయసు) ఆధారంగా ఎవరు ఏ పత్రాలు అందజేయాల్సి ఉంటుందో జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. 

  • 1–7–1987 కంటే ముందు పుట్టినవారు ఎన్నికల సంఘం పేర్కొన్న 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదో ఒకటి తమది ఇవ్వాలి.  

  • 1–7–1987 నుంచి 2–12–2004 మధ్య పుట్టిన వారు గుర్తింపు పత్రంతో పాటు తల్లిదండ్రుల్లో ఎవరిదో ఒకరిది కూడా అందజేయాలి. 

  • 2–12–2004 తర్వాత పుట్టినవారు  తమతోపాటు తల్లిదండ్రులిద్దరి పత్రాలు ఇవ్వాలి.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement