చిన్నారులకు ‘పౌష్టికాహార కిట్స్‌

Telangana: Minister Harish Rao Program For Anganwadi Children In Siddipet - Sakshi

పైలెట్‌ ప్రాజెక్ట్‌గా సిద్దిపేట 

అంగన్‌వాడీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెంపే లక్ష్యం 

మంత్రి హరీశ్‌ మదిలో ఆలోచన.. 8న లాంఛనంగా ప్రారంభం 

సిద్దిపేటజోన్‌: సిద్దిపేటలో అంగన్‌వాడీ పిల్లల కోసం మంత్రి హరీశ్‌రావు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. చిన్నారులకు కరోనా థర్డ్‌వేవ్‌ ముప్పు పొంచి ఉందన్న వైద్యుల హెచ్చరికలతో వారిలో రోగనిరోధక శక్తి పెంపే లక్ష్యంగా ‘పౌష్టికాహారం కిట్స్‌’ పంపిణీని పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. కర్ణాటకలో సత్ఫలిస్తున్న ‘క్షీరభాగ్య’ తరహాలో చిన్నారుల్లో ఐరన్‌ లోపం, రక్తహీనత వంటి సమస్యలు అధిగమించే దిశగా ఇమ్యూనిటీ బూస్టర్‌ తరహాలో దీనిని రూపొందించారు. అన్నపూర్ణ ట్రస్ట్‌ సహకారం, దాతల తోడ్పాటుతో జిల్లాలోని చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనుకుంటున్నారు.  

ఎన్‌ఐఎన్‌ నిర్ధారణతో... 
సిద్దిపేట జిల్లాలో ఆయా అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో గత ఏడాది జాతీయ పోషకాహర సంస్థ (ఎన్‌ఐఎన్‌) పర్యవేక్షణలో బృందాలు సర్వే చేసి చిన్నారులకు పోషకాహారలోపం ఉందని నిర్ధారించాయి. ఈ క్రమంలోనే కరోనా థర్డ్‌ వేవ్‌ రానుందని, ముఖ్యంగా చిన్నారులపై ప్రభావం చూపనుందని ప్రచారం సాగుతోంది. ఆరేళ్లలోపు చిన్నారుల పోషకాహారలోపం సరిదిద్ది బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలని మంత్రి హరీష్‌ సంకల్పించారు. ఈ నెల 8న స్థానిక ప్రభుత్వ ఇందిరానగర్‌ పాఠశాలలో దీనిని లాంఛనంగా ప్రారంభించనున్నారు.  

కిట్స్‌లో ఇలా
జిల్లా మహిళ, శిశు సంక్షేమ శాఖ రికార్డుల ప్రకారం సుమారు 60 వేలమంది చిన్నారులు ఉండగా, వారిలో మూడేళ్ల నుంచి ఆరేళ్ల వయసులోపు ఉన్నవారు సుమారు 25 వేలు.  
వీరిలోని ప్రతి ఒక్కరికీ నెలకు 450 గ్రాముల పౌష్టికాహారం కిట్స్‌ పంపిణీ చేయనున్నారు.  
కిట్స్‌లో పాలు, షుగర్‌తో పాటు న్యూట్రీషియన్‌ పౌడర్, విటమిన్‌ సి, కాల్షియం, జింక్, ఐరన్, మెగ్నీషియం వంటివిS ఉంటాయి. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top