సాక్షి,హైదరాబాద్: జీహెచ్ఎంసి డీలిమిటేషన్పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. డీలిమిటేషన్పై అభ్యంతరాలు స్వీకరించే గడువును మరో రెండు రోజులు పొడిగించింది.
ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీహెచ్ఎంసీ 24 గంటల్లోపు జనాభా వివరాలు, వార్డుల వారీగా మ్యాప్ను పబ్లిక్ డొమైన్లో ఉంచాలి. పౌరులు రెండు రోజుల్లోపు తమ అభ్యంతరాలను సమర్పించాలి. వాదనలో అడ్వకేట్ జనరల్, సెన్సస్ కమిషనర్ ఇచ్చిన డిసెంబర్ 31 డెడ్లైన్ గురించి ప్రస్తావించారు. డెడ్లైన్ దగ్గర పడుతున్నందున.. రెండు రోజులకు మించి గడువు పొడిగించడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ల న్యాయవాదులు మూడు రోజులు గడువు ఇవ్వాలని కోరగా.. హైకోర్టు రెండు రోజులు సరిపోతుందని తేల్చిచెప్పింది.
అంతకుముందు జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా పిటిషనర్లు, ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై స్టే ఇవ్వాలని పిటిషనర్లు కోరగా, రాష్ట్ర ప్రభుత్వ తరఫున హైకోర్టులో వాదనలు వినిపించిన అడ్వొకేట్ జనరల్ (ఏజీ) పిటిషనర్ల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.
డీలిమిటేషన్పై ముందస్తు సమాచారం ఇవ్వలేదని పిటిషనర్లు వాదించారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది ప్రభాకర్ మాట్లాడుతూ.. డీలిమిటేషన్ మ్యాప్ను పబ్లిక్ డొమైన్లో ఉంచలేదని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ప్రతిగా పునర్విభజన మ్యాప్ను హైకోర్టుకు సమర్పించామని ఏజీ చెప్పారు. నియోజకవర్గాల సరిహద్దులు మార్చకుండా వార్డుల విభజన మాత్రమే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. పై విధంగా స్పందించింది.


