హైదరాబాద్: తెలంగాణలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు నిల్వలు సమృద్ధిగా ఉన్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు ఎటువంటి అపోహలకు గురి కావద్దని సూచించారు.
రోజుకి 9,574 కిలోలీటర్ల పెట్రోల్, 14,457 కిలో లీటర్ల డీజిల్ మొత్తం 24 వేల కిలో లీటర్ల పైగా పెట్రోల్, డీజిల్ను బంకుల ద్వారా వాహనదారులకు పోస్తున్నట్లు తెలిపారు. అలాగే వినియోగదారులకు 2 లక్షల 22 వేల కు పైగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు. పెట్రోల్,డీజిల్ సరఫరా, గ్యాస్ డెలివరీలపై పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ నెంబర్ 1967కు ఫోన్ చయొచ్చని కోరారు.

కాగా, రెండు రోజులపాటు బంకుల్లో పెట్రోల్, డీజిల్ ఉండదన్న వదంతులతో ఖమ్మం నగరంలో వాహనదారుల పెట్రోల్ బంక్ల ముందు క్యూ కట్టారు. రాత్రి నుంచి వాహనదారులు పెట్రోల్ బంకుల ముందు నిలబడుతున్నారు.
కొన్ని బంకులు మూసివేసి ఉండటంతో వాహనదారుల్లో ఆందోళన మొదలై బంకుల ముందు క్యూ కడుతున్నారు. పెట్రోల్, డీజిల్ దొరకదని అపోహలతో కొంతమంది వ్యక్తులు క్యాన్లలో నింపుకుని పోతున్న వీడియోలు వైరల్గా మారాయి. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ సహా పలు నగరాల్లోనూ ఇటువంటి ఘటనలే చోటుచేసుకున్న విషయం తెలిసిందే.



