ప్రభుత్వ బడుల్లో టెక్‌ కోర్సులు | Tech courses in government schools | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ బడుల్లో టెక్‌ కోర్సులు

Jun 16 2025 5:50 AM | Updated on Jun 16 2025 5:50 AM

Tech courses in government schools

ఎంవోయూలు కుదుర్చుకున్న సందర్భంగా ఎన్జీవోల ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు

ఆరు సంస్థలతో సర్కారు అవగాహన ఒప్పందాలు 

సీఎం రేవంత్‌  సమక్షంలో ఎంవోయూలు 

ఏఐ, కంప్యూటేషనల్‌ థింకింగ్‌, కోడింగ్‌తోపాటు జేఈఈ, నీట్‌ శిక్షణ 

బాలికల అక్షరాస్యత పెంపునకూ కృషి

సాక్షి, హైదరాబాద్‌: సర్కారు బడుల్లో అత్యాధునిక బోధన సేవలను ఉచితంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆరు ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమక్షంలో విద్యాశాఖ అధికారులు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. దీంతో పాఠశాలల్లో ఆధునిక బోధన సదుపాయాలు అందనున్నాయని ప్రభుత్వం తెలిపింది. 

ప్రముఖ వాణిజ్యవేత్త నందన్‌ నీలేకని సారథ్యంలోని ఎక్‌స్టెప్‌ ఫౌండేషన్, డాక్టర్‌ సునీతా కృష్ణన్‌ సారథ్యంలోని ప్రజ్వల ఫౌండేషన్, అలక్‌ పాండే ఆధ్వర్యంలోని ఫిజిక్స్‌వాలా, ఖాన్‌ అకాడమీ, షోయబ్దార్‌ నిర్వహిస్తున్న పైజామ్‌ ఫౌండేషన్, సఫీనా హుస్సేన్‌ ఆధ్వర్యంలోని ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ సంస్థలతో ఈ ఒప్పందాలు జరిగాయి. 

ఎంవోయూ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, సీఎం స్పెషల్‌ సెక్రటరీ అజిత్‌ రెడ్డి, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ నర్సింహారెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నవీన్‌ నికోలస్‌ తదితరులు పాల్గొన్నారు.  

ఈ సంస్థలు అందించే సేవలివీ.. 
–ఎక్‌స్టెప్‌ ఫౌండేషన్‌ 540 పాఠశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌పై పని చేస్తుంది. 33 జిల్లాల పరిధిలో 5వేలకుపైగా పైగా ప్రాథమిక పాఠశాలలకు దీన్ని విస్తరిస్తుంది. మూడు నుంచి ఐదో తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్‌ భాషలతోపాటు మ్యాథ్స్‌పై బేసిక్స్‌ను అందిస్తుంది.  

–ఫిజిక్స్‌వాలా ఇంటర్మీడియట్‌ విద్యార్థులను నీట్, జేఈఈ, క్లాట్‌ పరీక్షలకు సన్నద్ధులను చేస్తుంది. పాఠశాలస్థాయి నుంచే పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తుంది.  

–ఖాన్‌ అకాడమీ రాష్ట్రంలో 6 నుంచి పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలకు అనుగుణంగా వీడియో ఆధారిత సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్‌పై శిక్షణ ఇస్తుంది. 

–ప్రజ్వల ఫౌండేషన్‌ 6వ తరగతి నుంచి క్లాస్‌ 12 వరకు విద్యార్థులకు రాష్ట్రవ్యాప్తంగా బాల సురక్ష, రక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తుంది.  

–పైజామ్‌ ఫౌండేషన్‌ ఒకటో తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు కోడింగ్‌ మరియు కంప్యూటేషనల్‌ థింకింగ్‌పై శిక్షణ ఇస్తుంది.  

–ఎడ్యుకేట్‌ గర్ల్స్‌ సంస్థ రాష్ట్రంలో పాఠశాలలకు దూరంగా ఉన్న 16 వేలకు పైగా పిల్లలను తిరిగి బడిలో చేర్పించటంతో పాటు బాలికల అక్షరాస్యత, విద్యావకాశాలను మెరుగుపరుస్తుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement