భార్యతో అక్రమ సంబంధం.. స్నేహితుడిని చంపిన భర్త! | Suryapet Wife and Husband Incident | Sakshi
Sakshi News home page

భార్యతో అక్రమ సంబంధం.. స్నేహితుడిని చంపిన భర్త!

Apr 14 2026 12:11 PM | Updated on Apr 14 2026 1:10 PM

Suryapet Wife and Husband Incident

చివ్వెంల(సూర్యాపేట) : తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని యువకుడిని హత్య చేసిన వ్యక్తిని, అతడికి సహకరించిన భార్యను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం సూర్యాపేట రూరల్‌ సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. చివ్వెంల మండలం ఎంజీనగర్‌ తండాకు చెందిన రత్నావత్‌ మణిభార్గవ్, రత్నావత్‌ సాయిదుర్గ ఆటో డ్రైవర్లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరిద్దరు స్నేహితులు. సాయిదుర్గ భార్య సాయిశ్రీతో మణిభార్గవ్‌ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 

ఈ విషయం గ్రామంలో అందరికీ తెలియడంతో మణిభార్గవ్‌కు ఈ నెల 9న రాత్రి సాయిదుర్గ ఫోన్‌ చేసి గ్రామ శివారులోని అడవికుంట చెరువు వద్దకు రమ్మని చెప్పాడు. దీంతో మణిభార్గవ్‌ చెరువు వద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడి చేరుకున్న సాయిదుర్గ, అతడి భార్య సాయిశ్రీ కలిసి మణిభార్గవ్‌తో ఘర్షణకు దిగారు. ఈ క్రమంలో మణిభార్గవ్‌ను సాయిదుర్గ కిందపడేసి ఛాతిపై బలంగా కొట్టడంతో అతడు స్పృహ కోల్పోయాడు. అనంతరం ఆటో స్టార్ట్‌ చేసే తాడును మణిభార్గవ్‌ మెడకు గట్టిగా బిగించడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. 

అనంతరం సాయిదుర్గ, సాయిశ్రీ దంపతులు అక్కడి నుంచి పరారయ్యారు. మృతుడి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో దురాజ్‌పల్లి గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. హైదరాబాద్‌కు వెళ్తున్న సాయిదుర్గ, సాయిశ్రీ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకుని సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. నిందితుల నుంచి ఆటో, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement