
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఇంత జాప్యమా?
ఎమ్మెల్యేలతో ఎందుకు సమన్వయం చేసుకోవడం లేదు?
కలెక్టర్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం
జూన్ 6లోపు లబ్ధిదారుల జాబితా సిద్ధం కావాలని ఆదేశం
హనుమకొండలో ఉమ్మడి వరంగల్ జిల్లాపై సమీక్ష
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యేలతో ఎందుకు సమన్వయం చేసుకోలేకపోతున్నారని జిల్లాల కలెక్టర్లను నిలదీశారు. అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో కలసి హనుమకొండ కలెక్టరేట్లో గురువారం ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం సేకరణ, వ్యవసాయం, వర్షాకాలం ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇళ్లు, భూ భారతి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణపై కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జూన్ 6 లోపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తిచేసి ప్రొసీడింగ్స్ ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. ‘ముఖ్యమంత్రి, మంత్రులంతా రెగ్యులర్గా వీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించటం వేరే పనిలేక కాదు. ఇందిరమ్మ ఇళ్లపై ఇప్పటివరకు కనీసం 50 శాతం కూడా లబ్ధిదారుల లిస్ట్ ప్రకటించకపోవడం బాధాకరం. బెనిఫిషరీ లిస్ట్ ఫ్రేమ్ కట్టు కోవడానికి కాదు.
లబ్ధిదారుల ఎంపికలో ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఒక్కో కలెక్టర్ పరిధిలో ఇద్దరు, ముగ్గురికి మించి ఎమ్మెల్యేలు లేరు. వారితో ఎందుకు సమన్వయం చేసుకోలేకపోతున్నారు? ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు ఇవ్వకుండా మీ దగ్గర పెట్టు కోవడం సరికాదు’అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్
వానాకాలం సీజన్ ఆరంభమైన నేపథ్యంలో నకిలీ విత్తనాలు, ఎరువుల విక్రయాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని పొంగులేటి ఆదేశించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మేవారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 85 శాతం ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. భూముల రిజి్రస్టేషన్కు సంబంధించి సాదా బైనా మా విషయం కోర్టులో ఉందని, కోర్టులకు సెలవులు పూర్తికాగానే ఈ అంశంపై నిర్ణయం తీసు కుంటామని చెప్పారు.
గ్రామ పాలనాధికారుల పరీక్షలో అర్హత సాధించినవారిని జూన్ 2 నుంచి ఉద్యోగాల్లోకి తీసుకుంటామని వెల్లడించారు. సమావేశంలో ప్రభుత్వ విప్ రామచంద్రు నాయ క్, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యేలు మామిడాల యశస్వినిరెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, దొంతి మాధవరెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.