కిషన్రెడ్డిపై రేవంత్ ఆరోపణలు రాజకీయ నాటకం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం రేవంత్రెడ్డి కొత్త డ్రామాలకు తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు విమర్శించారు. గత రెండున్నరేళ్లలో ప్రధాని మోదీని పలుమార్లు కలిసిన సీఎం... కేంద్రమంత్రులను కలవడానికి అడ్డంకులు కల్పిస్తున్నారనడం హాస్యాస్పదమన్నారు. సీఎం మాటలు చెప్పడంలోనే కాకుండా...ఇప్పుడు అబద్ధాల ప్రచారంలోనూ ప్రావీణ్యం సంపాదించారని ఎద్దేవా చేశారు. అబద్ధాన్ని పదేపదే చెప్పి నిజమని నమ్మించేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర ప్రభుత్వాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తమ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని దాచేందుకే రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
బుధవారం బీజేపీ కార్యాలయంలో రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరుతూ కిషన్ రెడ్డికి సీఎం లేఖ రాయడం అత్యంత హాస్యాస్పదమన్నారు. ఇప్పటివరకు సీఎం ఢిల్లీకి 71సార్లు వెళ్లారని, కనీసం 15సార్లు కేంద్రమంత్రులను కలిశారని గుర్తుచేశారు. ఆ సందర్భాల్లో ఎప్పుడైనా కిషన్రెడ్డికి చెప్పి కలిశారా? ఇప్పుడు అపాయింట్మెంట్ ఇప్పించడం లేదంటూ కిషన్రెడ్డిపై ఆరోపణలు చేయడం బూటకమేనని మండిపడ్డారు. కేవలం ప్రజలను తప్పుదారి పట్టించేందుకే రేవంత్ రెడ్డి ఈ లేఖ రాశారని దుయ్యబట్టారు.
కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై, బీజేపీపై నిరాధార ఆరోపణలు చేయడం వెంటనే మానుకోవాలన్నారు. మెట్రో విస్తరణ ఆలస్యానికి కేంద్రం, కిషన్ రెడ్డి కారణం కాదని, కేవలం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే ప్రధానకారణమని పేర్కొన్నారు. కాగా, సీనియర్ సినీ ఆర్టిస్ట్ జ్యోతిరెడ్డి, నిర్మాత బండి శ్రీనివాస్ బీజేపీలో చేరడం పట్ల రాంచందర్రావు హర్షం వ్యక్తం చేశారు.


