
తెలిసిన మహిళే ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తింపు
నిందితురాలి అరెస్టు, రిమాండ్
మణికొండ(హైదరాబాద్): ఓ వృద్ధురాలి మెడలో, కాళ్లకు ఉన్న బంగారం, వెండిపై కన్నేసిన ఓ మహిళ ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుని వెళ్లి హత్య చేసిన సంఘటనను నార్సింగి పోలీసులు చేధించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ గ్రామానికి చెందిన రామేశ్వరం బాలమ్మ(75) ఈ నెల 3వ తేదీన ప్రతిరోజు మాదిరిగానే వాకింగ్కు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవటం, ఆమె కోడలు ఓ మహిళపై అనుమానం వ్యక్తం చేస్తూ 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
కాగా కోడలు లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు..ఆమె అనుమానం వ్యక్తం చేసిన మహిళ అనిత కూడా అప్పటి నుంచి కనిపించకుండా పోవడంతో వెదకడం ప్రారంభించారు. 4వ తేదీనే బాలమ్మ మృతదేహం వికారాబాద్ జిల్లా చెన్గొముల్ పోలీస్స్టేషన్ పరిధిలో కనిపించింది. అప్పటికే మృతదేహం గుర్తు పట్టరాకుండా ఉండటం, శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవటంతో వారు స్పాట్లోనే పోస్టుమార్టం నిర్వహించి
కండ్లపల్లి అడవిలోనే ఖననం చేశారు.
అనిత చిక్కడంతో వెలుగులోకి..
నార్సింగి పోలీసులు విచారణ క్రమంలో అనితను ఈ నెల 7వ తేదీన ఆమె స్వస్థలం వికారాబాద్ జిల్లా పరిగి మండలం, మిట్టకోడూరు గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. ఆమెను తమదైన శైలిలో విచారించటంతో బాలమ్మను తానే బంగారం గురించి హత్య చేశానని, ఆమె వద్ద ఉన్న బంగారం, వెండి తస్కరించినట్టు అంగీకరించింది. మృతదేహం కండ్లపల్లి అడవిలో వదిలేశానని తెలిపింది. దాంతో చెన్గొముల్ పోలీసులను సంప్రదించటంతో గుర్తు తెలియని మహిళ శవంగా భావించి పోస్టు మార్టం నిర్వహించి అక్కడే పూడ్చివేశామని తెలిపారు. దాంతో పూడూర్ మండల తహసీల్దార్ అనుమతితో పాతిపెట్టిన బాలమ్మ మృతదేహాన్ని ఈనెల 7వ తేదీన వెలికి తీశారు. ఆమెను బాలమ్మగానే బంధువులు గుర్తించటం, హంతకురాలి వద్ద ఉన్న బంగారం, వెండి స్వా«దీనం కావటంతో అనితను అరెస్టు చేశారు.