సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన బండి సంజయ్ తనయుడి కేసు మరో మలుపు తిరిగేలా కనిపిస్తోంది. ఈ కేసులో భగీరథ్ను విచారించాలని ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది. అలాగే బాధితురాలి స్టేట్మెంట్ను మరోసారి రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తోంది. కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించిన మరుసటిరోజే ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండడం గమనార్హం.
ఈ కేసులో ఇప్పటికే బాధితురాలు, ఆమె కుటుంబం స్టేట్మెంట్లు నమోదు అయ్యాయి. అయితే సిట్ ఏర్పాటు నేపథ్యంలో మరోసారి రికార్డు చేయాలని అనుకుంటోంది. తద్వారా ఎఫ్ఐఆర్లోని సెక్షన్లు మార్చే అవకాశమూ కనిపిస్తోంది. అలాగే బండి భగీరథ్ ఆచూకీ లేకుండా పోయాడన్న ప్రచారం నేపథ్యంలో నోటీసులు ఇచ్చి మరీ విచారణ జరిపొచ్చని తెలుస్తోంది.
మైనర్ బాలిక కేసుతో పాటు గతంలో జరిగిన ఘటనలు, సోషల్ మీడియా వైరల్ వీడియోల ఆధారంగా విచారణ జరిపే చాన్స్ ఉంది. అలాగే కేసుల్లో సంబంధం ఉన్నవారిని సైతం సిట్ విచారించవచ్చని తెలుస్తోంది. కేసు విచారణను వేగవంతం చేయడానికి పేట్ బషీరాబాద్ ఏసీపీ, ఇన్స్పెక్టర్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) చీఫ్, కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ ఇప్పటికే సమావేశం నిర్వహించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేశారు.
ఈ కేసుపై ఆమె స్పందిస్తూ.. ‘‘పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు నంబర్ 684/2026 కింద దర్యాప్తు జరుపుతున్నాం. ఈ కేసులో అందుబాటులో ఉన్న అన్ని వివరాలను ఇప్పటికే అధ్యయనం చేశాం. చట్టప్రకారం అవసరమైన అన్ని ఆధారాలు సేకరిస్తున్నాం. ఫోన్ కాల్ డేటా, టెక్నికల్ ఎవిడెన్స్తో పాటు ఇతర ముఖ్యమైన ఆధారాలు కూడా సమీకరిస్తున్నాం. నేరం రుజువైతే నిందితుడిని తప్పకుండా అరెస్టు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. బాధితురాలికి న్యాయం చేస్తాం’’ అని వెల్లడించారామె.


