తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారు? | Mla Pedda Reddy Petition On Jc Prabhakar Reddy In Ts High Court | Sakshi
Sakshi News home page

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకున్నారు?

Aug 2 2023 9:00 AM | Updated on Aug 2 2023 11:30 AM

Mla Pedda Reddy Petition On Jc Prabhakar Reddy In Ts High Court - Sakshi

 బీఎస్‌–3 వాహనాలను బీఎస్‌-4గా మార్చి నడుపుతున్నారన్న ఫిర్యాదుపై ఎందుకు విచారణ చేయలేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.

సాక్షి, హైదరాబాద్‌: బీఎస్‌–3 వాహనాలను బీఎస్‌-4గా మార్చి నడుపుతున్నారన్న ఫిర్యాదుపై ఎందుకు విచారణ చేయలేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఈ మేరకు పలువురు ఉన్నతాధికారులు, సీబీఐతో పాటు టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని స్పష్టం చేస్తూ విచారణను వాయిదా వేసింది.

టీడీపీ నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డికి చెందిన దివాకర్‌ ట్రావెల్స్‌ బీఎస్‌–3 వాహనాలను బీఎస్‌–4గా మార్చి నడపడంపై తాను 2020 అక్టోబర్‌ 12న రవాణా శాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదంటూ ఏపీలోని తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఏపీలో తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి అక్రమాలు తేలడంతో పలు వాహనాలను సీజ్‌ చేశారని పేర్కొన్నారు.
చదవండి: తీవ్ర వాయుగుండం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు

తెలంగాణలో మాత్రం వాహనాలను అక్రమంగా నడుపుతున్నారని వివరించారు. ఇది సుప్రీం ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో జేసీ ప్రభాకర్‌రెడ్డిపై విచారణ జరిపి కేసు నమోదు చేసేలా అధికారులను ఆదేశించాలని.. కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని కోరారు. దీనిపై జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. వాదనల అనంతరం ప్రతివాదులైన రాష్ట్ర రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, రవాణా శాఖ కమిషనర్, డీజీపీ, సీబీఐతో పాటు జేసీ ప్రభాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేస్తూ విచారణను సెప్టెంబరు 12కు వాయిదా వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement