తెల్లవారితే పెళ్లి చూపులు.. అంతలోనే మృత్యు ఒడికి.. | Man Died in Road Accident | Sakshi
Sakshi News home page

తెల్లవారితే పెళ్లి చూపులు.. అంతలోనే మృత్యు ఒడికి..

Jun 24 2024 6:46 AM | Updated on Jun 24 2024 6:46 AM

Man Died in Road Accident

 జూబ్లీహిల్స్‌లో రోడ్డు ప్రమాదం 

 టిప్పర్‌ ఢీకొని యువకుడి మృతి

బంజారాహిల్స్‌: మరుసటి రోజే ఆ యువకుడికి పెళ్లి చూపులు.. ఉదయంలోగా ఇంటికి వెళ్లేందుకు బైక్‌పై బయలుదేరాడు. అతివేగంతో వచి్చన టిప్పర్‌ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.  ఈ ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన కృష్ణమ్మ, సుధాకర్‌ దంపతుల కుమారుడు శివశంకర్‌ (30) రాయదుర్గం సమీపంలోని అడాప్‌్ట్స ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. 

దుర్గం చెరువు సమీపంలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆదివారం పెళ్లి చూపులు ఉండటంతో శనివారం అర్ధరాత్రి మాదాపూర్‌ నుంచి బైక్‌పై స్వగ్రామానికి బయలుదేరాడు. రెండు నెలల క్రితమే ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న బుల్లెట్‌ బైక్‌పై హెల్మెట్‌ ధరించి జూబ్లీహిల్స్‌ అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంతో వచి్చ న టిప్పర్‌ శివశంకర్‌ బైక్‌ను ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. 

ప్రమాదానికి కారణమైన టిప్పర్‌ను పోలీసులు గుర్తించారు. డ్రైవర్‌ పరారయ్యాడు.  మరికొన్ని గంటల్లో స్వగ్రామంలో ఉండాల్సిన శివశంకర్‌ విగత జీవిగా మారడంతో విషయం తెలుసుకున్న  తల్లిదండ్రులు, బంధుమిత్రులు పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంటికి  బాధ్యతలను మోస్తున్న శివశంకరే కన్నుమూయడంతో కన్నవారు గుండెలవిసేలా రోదించారు. పెళ్లి చూపుల కోసం ఏర్పాట్లు చేసుకునే క్రమంలో ఈ దుర్ఘటన జరగడంతో శివశంకర్‌ పని చేస్తున్న సంస్థలో, స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement