సాక్షి,హైదరాబాద్: ఏఐఎంఐఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ మంగళవారం (ఫిబ్రవరి 3, 2026) కన్నుమూశారు. గత రెండు సంవత్సరాలుగా మూత్రపిండ సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లోని ఒవైసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కొద్ది సేపటి క్రితం మరణించారు. అనారోగ్య సమస్యతో గతేడాది నవంబర్ చివరి వారంలో ఆసుపత్రిలో చేరగా.. పరిస్థితి విషమించి చివరికి తుదిశ్వాస విడిచారు.
పాషా ఖాద్రీ ఏఐఎంఐఎంలో కీలక స్థానాన్ని దక్కించుకున్న నేత. 2004లో చార్మినార్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, వరుసగా మూడు సార్లు అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 2018లో యాకుత్పుర నియోజకవర్గం నుంచి గెలిచి 2023 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. పాషా ఖాదద్రీ ఏఐఎంఐఎం వ్యవస్థాపకుడు సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీకి అత్యంత సన్నిహితుడిగా, విశ్వసనీయ సహచరుడిగా గుర్తింపు పొందారు.
2008లో ఏఐఎంఐఎం జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టిన పాషా ఖాద్రీ, పార్టీని బలోపేతం చేయడంలో, ముఖ్యంగా హైదరాబాద్లోని ముస్లిం ఓటర్లలో ఏఐఎంఐఎం స్థిరమైన ఆధిపత్యాన్ని కొనసాగించడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన వ్యూహాత్మక నిర్ణయాలు, పార్టీ విస్తరణలో చేసిన కృషి ఏఐఎంఐఎంకు బలమైన పునాది వేశాయి.
సుమారు 60 ఏళ్ల వయసులో ఖాద్రీ మరణం ఎంఐఎంకు పెద్ద లోటు. చార్మినార్, యాకుత్పురా నియోజకవర్గాల్లో ఆయనకు ఉన్న బలమైన పట్టు, ప్రజలతో ఉన్న అనుబంధం పార్టీకి అమూల్యమైందని ఎంఐఎం వర్గాలు తెలిపాయి. పార్టీలో ఆయన స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని సహచర నేతలు చెబుతున్నారు.


