
అధికారంలో లేకున్నా రాష్ట్రాభివృద్ధే అభిమతం
వివిధ రంగాల్లో విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలి
వార్విక్ యూనివర్సిటీలో పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ ప్రారంభోత్సవంలో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: అధికారంలో ఉన్నా లేకున్నా తెలంగాణ అభివృద్ధే తమ అభిమతమని.. ఇండియా ఫస్ట్.. తెలంగాణ ఫస్ట్ అన్నదే తమ నినాదమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు సాధించడం ద్వారా యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభించేందుకు సర్వశక్తులూ ఉపయోగిస్తామని చెప్పారు. ఇంగ్లండ్లోని వార్విక్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రొగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ (పీడీఎస్ఎల్) నాలెడ్జ్ సెంటర్ను కేటీఆర్ శనివారం ప్రారంభించారు.
పీడీఎస్ఎల్ కార్యకలాపాలను భారత్కు విస్తరించాలన్నారు. ఇంగ్లండ్లో యూనివర్సిటీ, ఇండస్త్రీల మధ్య పరస్పర సహకారం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమోటివ్ కంపెనీలకు పరిశోధన, అభివృద్ధి సేవలను అందించే పీడీఎస్ఎల్ నాలెడ్జ్ సెంటర్ తెలంగాణ టాలెంట్కు నిదర్శనమని కేటీఆర్ కొనియాడారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ వినూత్న విధానాలతోనే..
బీఆర్ఎస్ ప్రభుత్వ వినూత్న విధానాలతో పుణే, చెన్నై సరసన హైదరాబాద్ ఆటోమోటివ్ హబ్గా నిలిచిందని కేటీఆర్ చెప్పారు. తమ ప్రభుత్వ కాలంలోనే ఐటీ, లైఫ్ సైన్సెస్తోపాటు ఆటోమోటివ్ రంగంలోనూ తెలంగాణ సత్తా చాటిందన్నారు. ఈ రంగంలో కేవలం పరిశోధన, అభివృద్ధికే పరిమితం కాకుండా తయారీ రంగంలోనూ తెలంగాణను నంబర్ వన్గా నిలిపేందుకు తమ ప్రభుత్వం తెచ్చిన విధానాలు ఉపయోగపడతాయని కేటీఆర్ అన్నారు.
భారత్లో ఫార్ములా ఈ–రేసింగ్ చాంపియన్షిప్ను నిర్వహించిన మొదటి రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్న కేటీఆర్... పెట్టుబడులను ఆకర్షించడంతోపాటు రాష్ట్రంలో మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేసిందన్నారు.
ఐటీ ఎగుమతుల్లోనూ పురోగతి
తమ ప్రభుత్వ నిరంతర కృషితో అంతర్జాతీయ కంపెనీలకు కొత్త చిరునామాగా తెలంగాణ మారిందని కేటీఆర్ పేర్కొ న్నారు. గూగుల్, అమెజాన్, ఫేస్బుక్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు తమ అతిపెద్ద కార్యాల యాలను హైదరాబాద్లో ప్రారంభించాయని గుర్తుచే శారు. తమ తొమ్మిదేళ్ల పాలనలో ఐటీ ఉద్యోగాలు, ఎగుమతులతోపాటు ఇతర రంగాల్లోనూ తెలంగాణ అద్భుతంగా పురోగతి సాధించిందని చెప్పారు.
ఐటీ, అనుబంధ రంగాలతోపాటు ఆటోమొబైల్ వంటి ఇతర రంగాల్లోనూ భారత యువత ప్రతిభ, నిబద్ధతతో అద్భు తంగా రాణిస్తున్నారని కేటీఆర్ ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా యువ త, విద్యార్థులతోపాటు కంపెనీలు కూడా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. కార్యక్రమంలో పీడీఎస్ ఎల్ డైరెక్టర్ క్రాంతి పుప్పాల పాల్గొన్నారు.