హైదరాబాద్: కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీలో ప్రైవేట్మెంబర్ బిల్ పెడతామని తెలంగాణ మాజీమంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రపంచంలో పెద్ద ఫ్రాడ్ ఏంటంటే కాంగ్రెస్ ఇచ్చిన హామీలేనని అన్నారు.
‘ప్రజల నుంచి ఓట్లు రాబట్టడానికి కాంగ్రెస్ అడ్డగోలు హామీలు ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల చట్టం ఫైల్ పై సంతకం చేశారు. అప్పటి గవర్నర్ తమిళిసై కూడా ప్రసంగంలో అసెంబ్లీ లో చెప్పారు. 840 రోజులు అయినా అమలు చేయడం లేదు. వచ్చే శుక్రవారం రోజు ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ ఆమోదం తెలపాలని సభలో అడుగుతాం.
గతంలో అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్ పెట్టిన చరిత్ర ఉంది. మీరు ప్రవేశ పెట్టలేదని మేము ప్రవేశ పెడతాం. స్పీకర్, చైర్మన్ సభ్యులను అందరినీ కలుస్తాం. బీజేపీ వ్యతిరేకించినా ఏం ఇబ్బంది లేదు. ఫైల్ దొరకడం లేదని అంటున్నారు. ఢిల్లీ విమాన ప్రయాణంలో పోయిందా? ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం కాలిపోయిందా? అనే అనుమానం ఉంది.
మిగిలింది ఒక బడ్జెట్ మాత్రమే.. ఇచ్చిన హామీలను ఇంకా ఎప్పుడూ అమలు చేస్తారు? ఆరు గ్యారెంటీల చట్టం అయితే అన్ని వర్గాల వారికి లాభం అవుతుంది. ప్రజల తరుఫున ఈ బిల్ పెడుతున్నాం. పబ్లిక్ డొమైన్ లో బిల్ పెడతాం. అన్ని పార్టీలకు సహకరించాలని లేఖ రాస్తాం. నందమూరి తారక రామరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీజేపీ బిల్ పెట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బిల్ పెట్టిన చరిత్ర కూడా ఉంది’ అని తెలిపారు. ప్రజలకు న్యాయం జరగాలని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని అన్నారు.



