
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలో 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత తోడవుతోంది. ఈ క్రమంలో.. రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
సోమవారం నుంచి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముండడంతో.. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మూడు రోజులపాటు వడగాలులు వీచే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇక.. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో 15 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 5 రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది.