4 రోజులు.. రూ.812 కోట్లు
దుమ్ము లేపిన దసరా లిక్కర్ అమ్మకాలు
9.4 లక్షల కేసుల లిక్కర్, 9.29 లక్షల కేసుల బీర్లు వైన్ షాపులకు
అక్టోబర్లో రూ.2,112 కోట్లు దాటిన ఆబ్కారీ అమ్మకాలు
సాక్షి, హైదరాబాద్: ఈసారి దసరా పండుగకు మందు బాబులు దుమ్ము లేపారు. కరోనా ప్రభావం అసలుందా.. అనే స్థాయిలో ఫుల్లుగా తాగేశారు. ఈ నెల 22 నుంచి 25 వరకు రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి బయటకు వెళ్లిన లిక్కర్, బీర్ కేసుల విలువ రూ.812 కోట్ల పైమాటే. అంటే రోజుకు సగటున రూ.203 కోట్ల విలువైన మద్యం అమ్ముడయిందన్న మాట. అదే నెల సగటు చూస్తే రోజువారీ అమ్మకాలు రూ.82 కోట్లు మాత్రమే జరగడం గమనార్హం.
ఈ నెల మద్యం విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే లిక్కర్, బీర్లు కలిపి దాదాపు 50 లక్షల కేసుల వరకు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.2,112 కోట్లుగా ఉంది. ఈ నెల 27 నాటికి 27,08,292 కేసుల లిక్కర్, 22,65,397 కేసుల బీర్లు డిపోల నుంచి రాష్ట్రంలోని వైన్ షాపులకు చేరాయి. ఇందులో మూడో వంతు దసరా నాలుగు రోజుల్లోనే అమ్ముడయ్యాయి. ఈ నాలుగు రోజుల్లో 9,41,900 కేసుల లిక్కర్, 9,29,694 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.