దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా | Fake Certificate Mafia in Warangal District | Sakshi
Sakshi News home page

దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా

Jun 13 2025 1:19 AM | Updated on Jun 13 2025 1:19 AM

Fake Certificate Mafia in Warangal District

నర్సంపేటలోని శ్రీ అరుణోదయ విద్యాలయం జారీ చేసిన నకిలీ స్టడీ, కండక్ట్‌ అండ్‌ డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్‌లు , ఓ వివాహితకు వివేకానంద పబ్లిక్‌ స్కూల్‌ పేరుతో జారీ చేసిన నకిలీ రికార్డు షీట్‌

వయసు ధ్రువీకరణకు పిల్లలు లేని దంపతుల అడ్డదారులు

ఎక్కువ వయసున్నా తక్కువ ఉండేలా ప్రణాళిక 

ప్రైవేట్‌ పాఠశాలల పేర్ల మీద డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్ల దందా 

వరంగల్‌ జిల్లా కేంద్రంగా ‘కారా’నిబంధనలకు నీళ్లు  

సాక్షి, వరంగల్‌ : దత్తత ప్రక్రియలో కొందరు బాలల సంరక్షణ విభాగాధికారులు దందాకు తేర లేపారన్న ఆరోపణలున్నాయి. తక్కువ వయసున్న పిల్లల కోసం..కొందరు దంపతులు తమ వయసును తక్కువగా చూపించేందుకు కొన్ని స్కూళ్ల నుంచి స్టడీ, కండక్ట్, డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టీఫికెట్లు తీసుకున్నారు. కొందరైతే చదువుకోకున్నా, స్టడీ సరిఫికెట్లు తీసుకున్న ఘటనలు కూడా వెలుగుచూశాయి. తెర వెనుక ఉండి కొందరు అధికారులు ఈ తతంగాన్ని నడిపించనట్టు తెలుస్తోంది. వాస్తవానికి నిరక్షరాస్యులకు వయసు ధ్రువీకరణ పత్రం ప్రభుత్వామోదిత వైద్యుడి వద్ద ఓసిఫికేషన్‌ పరీక్ష నివేదిక ఆధారంగా తీసుకోవచ్చు.

లేదంటే పాన్‌కార్డులోని పుట్టిన తేదీ ఉంటే సరిపోతుంది. అయితే ఎక్కువ వయసున్న దంపతులకు తక్కువ వయసు పిల్లలను దత్తత ఇచ్చే అవకాశం లేదని అధికారులే ‘మామూలు’గా మాట్లాడతారు. కొందరు ప్రైవేట్‌ పాఠశాలల యజమానులతో కుమ్మక్కై సర్టీఫికెట్లను తీసుకొచ్చి వాటినే ఒరిజినల్‌గా చూపిస్తూ సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ (కారా) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

వాస్తవానికి దంపతులిద్దరి వయసు కలిపి 85 ఏళ్లుంటే రెండేళ్లలోపు పిల్లలు, 90 ఏళ్లుంటే రెండేళ్ల నుంచి నాలుగేళ్లలోపు, 100 ఏళ్లుంటే నాలుగు నుంచి ఎనిమిదేళ్లలోపు పిల్లలు, 110 ఏళ్లుంటే ఎనిమిది నుంచి 18 ఏళ్లలోపు పిల్లలను దత్తత ఇస్తారు. ఈ నేపథ్యంలో నకిలీ సర్టీఫికెట్ల తీసుకొని దందాకు తెరలేపారు. ఇలా చేసి పిల్లల జీవితాల్ని ఇరకాటంలోకి నెడుతున్నారు. ఎందుకంటే పిల్లలు పదో తరగతి చదువుకునే సమయంలో తల్లిదండ్రులు వృద్ధాప్య దశలోకి రావడం.. పిల్లల భవిష్యత్‌పై ప్రభావం చూపుతోంది.  

వరంగల్‌ కేంద్రంగా... 
వరంగల్‌ జిల్లా కేంద్రంగా 2022లో దత్తత కోసం దరఖాస్తు చేసుకున్న దంపతులిచ్చిన పత్రాల్లో ఈ నకిలీల బాగోతం బయటకు వచ్చింది. గత నెలలో రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ విభాగ ఉన్నతాధికారి దత్తతకు సంబంధించి హోంస్టడీ రిపోర్టులను సమీక్షించాలని చెప్పడం, దరఖాస్తు చేసుకున్నవారు రెన్యూవల్‌కు వచి్చన సందర్భంలో నకిలీ సర్టిఫికెట్ల అంశం అధికారుల దృష్టికి వచ్చింది. అయినా చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసిన సర్టీఫికెట్ల దర్యాప్తునకు ఆదేశిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. 

నర్సంపేట నుంచే నకిలీ సర్టీఫికెట్లు  
వరంగల్‌ జిల్లాలోని నర్సంపేట కేంద్రంగా శ్రీఅరుణోదయ విద్యాలయం, అరుణోదయ విద్యాలయం, ఏకశిల హైస్కూల్‌ పేర్లతో రెండు దశాబ్దాల క్రితం ఒకటి, రెండు, మూడో తరగతి చదువుకున్నారంటూ కొందరు పిల్లలు లేని దంపతులకు నకిలీ డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టీఫికెట్లు ఇచ్చారన్న ఆరోపణలున్నాయి. పిల్లలు లేని భార్యాభర్తలిద్దరూ చదువుకోకపోయినా, ఒకటే పాఠశాలలో చదివినట్టుగా సరిఫ్టికెట్‌ ఇవ్వడం, ఇద్దరూ వేర్వేరు ప్రాంతాలకు చెందినవారైనా, రెండు దశాబ్దాల క్రితం ఒకటే పాఠశాలలో చదివినట్టుగా ఇవ్వడం వివాదాస్పదమవుతోంది. అసలు వారు చదువుకున్న సమయంలో ఆ పాఠశాలలు లేకపోవడం గమనార్హం. 

 పర్వతగిరి మండలం చింతనెక్కొండలోని వివేకానంద పబ్లిక్‌ స్కూల్‌లో ఒకరు చదవుకున్నా చదివినట్టుగా పాఠశాల పేరుతో నకిలీ స్కూల్‌ రికార్డు షీట్‌ తీసుకున్నారని ఆ పాఠశాల నిర్వాహకుడు బి.సాంబయ్య లిఖితపూర్వక ఫిర్యాదు ఇచ్చారు.  

దత్తతకు వచ్చిన చాలామంది దంపతులు నర్సంపేటలోని పాఠశాలల నుంచే ఈ సర్టీఫికెట్లు తేవడంతో దీని వెనుక బడా నకిలీ సర్టిఫికెట్ల రాకెట్‌ ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర జిల్లాలకు చెందిన వారు సైతం ఇక్కడే చదువుకున్నట్టుగా సర్టీఫికెట్లు తీసుకెళ్లారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement