మిరుదొడ్డి(దుబ్బాక): బీరు సీసాలో నిరోధ్ దర్శనమివ్వడంతో మందుబాబులు అవాక్కయ్యారు. ఈ సంఘటన మంగళవారం అక్బర్పేట–భూంపల్లి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా... మండల కేంద్రంలోని ఓ మద్యం దుకాణంలో కొనుగోలు చేసిన బీరు సీసాలో నిరోధ్ ప్యాకెట్ దర్శనమివ్వడంతో కలకలం రేగింది. బీరు తాగేందుకు సీసాను పరిశీలించిన మద్యం ప్రియులు అందులో నిరోధ్ ఉండడంతో ఒక్కసారిగా కంగుతిన్నారు.
దీంతో మందుబాబులు మద్యం దుకాణం నిర్వాహకులను ప్రశ్నించగా, యజమానులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో దుకాణం నిర్వాహకులు, మందుబాబులకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న ఎక్సైజ్శాఖ ఎస్ఐ సరిత సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పోలీ సులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలకు నచ్చజెప్పడంతో వాగ్వాదం సద్దుమనిగింది.


