కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాం: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy team participating in World Expo in Osaka | Sakshi
Sakshi News home page

కొత్త ప్రపంచాన్ని నిర్మిద్దాం: సీఎం రేవంత్‌

Apr 22 2025 4:34 AM | Updated on Apr 22 2025 11:57 AM

CM Revanth Reddy team participating in World Expo in Osaka

జపాన్‌లోని ఒసాకాలో జరిగిన వరల్డ్‌ ఎక్స్‌పోలో సీఎం రేవంత్‌రెడ్డి

కలిసి పనిచేద్దామంటూ జపాన్‌ పారిశ్రామికవేత్తలకు సీఎం రేవంత్‌ ఆహ్వానం

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని వెల్లడి 

ఒసాకాలో వరల్డ్‌ ఎక్స్‌పోలో పాల్గొన్న సీఎం బృందం 

ప్రత్యేక ఆకర్షణగా తెలంగాణ పెవిలియన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఒసాకా బేలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యాయం తెలంగాణలో ప్రారంభమవుతోందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ, ఒసాకా, ప్రపంచం కలిసికట్టుగా అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ‘తెలంగాణకు జపాన్‌ మధ్య చక్కటి సంబంధాలున్నాయి. హైదరాబాద్‌కు రండి.. మీ ఉత్పత్తులు తయారు చేయండి.. భారత మార్కెట్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకోండి. కలిసి పనిచేద్దాం.. నవ ప్రపంచాన్ని నిర్మిద్దాం..’అంటూ జపాన్‌ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. 

జపాన్‌ పర్యటనలో ఉన్న రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్‌ ప్రతినిధి బృందం సోమవారం ఒసాకాలో జరిగిన వరల్డ్‌ ఎక్స్‌పోలో పాలుపంచుకుంది. వివిధ రంగాలకు చెందిన వ్యాపార వేత్తలు, పారిశ్రామికవేత్తలతో విడివిడిగా సమావేశమైంది. తెలంగాణలో వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం వివరించారు. ‘ఒసాకాలో జరుగుతున్న వరల్డ్‌ ఎక్స్‌పోలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ పాలుపంచుకోవటం గర్వంగా ఉంది. 

తెలంగాణ, జపాన్‌ల మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందాం. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్‌ ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దాం. మా ప్రభుత్వం స్థిరమైన, సులభతర పారిశ్రామిక విధానాన్ని అనుసరిస్తోంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయి..’అని సీఎం చెప్పారు.  

బయో, ఐటీ రంగాల్లో గుర్తింపు: శ్రీధర్‌బాబు 
ఐటీ, బయో టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ప్రత్యేకమైన గుర్తింపు సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. వీటితో పాటు ఏరోస్పేస్, ఎల్రక్టానిక్స్, టెక్స్‌టైల్‌ పరిశ్రమలకు ఉన్న అనుకూలతలను వివరించారు. హైదరాబాద్‌లో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తున్నామని, ఎకో, ఎనర్జీ, స్మార్ట్‌ మొబిలిటీ, సర్క్యులర్‌ ఎకానమీపై ఈ నగరం ఆధారపడుతుందని పేర్కొన్నారు. జపాన్‌కు చెందిన మరుబెని కార్పొరేషన్‌తో ఫ్యూచర్‌ సిటీలో ఇండస్ట్రియల్‌ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 

హైదరాబాద్‌ చుట్టూ 370 కిలోమీటర్ల రీజనల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌)తో పాటు రేడియల్‌ రోడ్లు నిర్మిస్తున్నామని, ఆర్‌ఆర్‌ఆర్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌)కు మధ్య ఉన్న జోన్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, ఏరోస్పేస్‌ పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని మంత్రి తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణతో పాటు నాణ్యత, క్రమశిక్షణకు అద్దం పట్టేలా యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్‌ రంజన్‌ చెప్పారు. 

జపాన్ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ



తెలంగాణ సంస్కృతికి ప్రతిబింబంగా పెవిలియన్‌ 
ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఒసాకా ఎక్స్‌పో’లో తెలంగాణ తన ప్రత్యేకపెవిలియన్‌ను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి..మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సోమవారం దీనిని ప్రారంభించారు. ప్రతి ఐదేళ్లకో మారు ఒసాకా ఎక్స్‌పో నిర్వహిస్తారు. అయితే ఈ ఎక్స్‌పోలో భారతదేశం నుంచి పాల్గొన్న తొలిరాష్ట్రం తెలంగాణ కావడం విశేషం. కిటాక్యుషు నుంచి సీఎం బృందం ఒసాకా చేరుకుంది. 

కాగా ఒసాకా ఎక్స్‌పో వేదికపై తెలంగాణ తన వైవిధ్యమైన సంస్కృతి, అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక అనుకూల వాతావరణం, సాంప్రదాయ కళలు, పర్యాటక ఆకర్షణలను ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే సందర్శకులకు చాటి చెప్పనుంది. తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర సాంకేతిక పురోగతి, సాంస్కృతిక వారసత్వం, పర్యాటక సంపదను ప్రతిబింబించే ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు, సాంస్కృతిక సహకారాన్ని పెంపొందించే దిశగా రాష్ట్రం అడుగులు వేయనుంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement