హిమాయత్‌సాగర్‌ వద్ద గేట్‌వే ఆఫ్‌ హైదరాబాద్‌: సీఎం రేవంత్‌ | CM Revanth Reddy Says Gateway of Hyderabad at Himayatsagar | Sakshi
Sakshi News home page

హిమాయత్‌సాగర్‌ వద్ద గేట్‌వే ఆఫ్‌ హైదరాబాద్‌: సీఎం రేవంత్‌

Aug 10 2025 5:10 AM | Updated on Aug 10 2025 5:10 AM

CM Revanth Reddy Says Gateway of Hyderabad at Himayatsagar

నగరానికి ముఖద్వారంగా ఎత్తయిన ఐకానిక్‌ టవర్‌ 

అద్భుత పర్యాటక ప్రాంతంగా బాపూఘాట్‌ పరిసరాలు 

బహుళ ప్రయోజనాలుండేలా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు 

అధ్యయనం, డిజైన్ల పనులు వేగవంతం చేయండి 

అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును బహుళ ప్రయోజనాలు ఉండేలా రూపకల్పన చేయా లని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌కు ముఖద్వారంగా ఉన్న హిమాయత్‌సాగర్‌ గాంధీ సరోవర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌రోడ్డుపై గేట్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ పేరిట ఐకానిక్‌ టవర్‌ను నిర్మించాలని సూచించారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై సీఎం శనివారం పలు సూచనలు చేశారు. 

వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు స్వాగతం పలికేలా గేట్‌ వే ఆఫ్‌ హైదరాబాద్‌ ఉండాలని తెలిపారు. ఓఆర్‌ఆర్‌కు ఒక వైపున ఎకో థీమ్‌ పార్క్‌ అభివృద్ధి చేసి, మరోవైపు బాపూఘాట్‌ దిక్కున భారీ ఐకానిక్‌ టవర్‌ నిర్మించాలని ఆదేశించారు. అందుకు తగిన డిజైన్లు రూపొందించాలని సూచించారు. బాపూఘాట్‌ చుట్టూ ఉన్న ప్రాంతాన్ని అందరినీ ఆకట్టుకునేలా డిజైన్‌ చేయాలని చెప్పారు. 

హిమాయత్‌ సాగర్‌ దగ్గర అప్రోచ్‌ రోడ్‌ నుంచి అత్తాపూర్‌ వైపు వెళ్లేందుకు కొత్త ఫ్లైఓవర్‌ నిర్మించాలని.. గాంధీ సరోవర్‌ చుట్టూ ఈ ప్లైఓవర్‌ కనెక్టివ్‌ కారిడార్‌లా ఉండాలని తెలిపారు. గాంధీ సరోవర్‌ వద్ద నిర్మించే ఐకానిక్‌ టవర్‌ ప్రపంచంలోనే ఎత్తయిన టవర్‌గా ఉండాలని సీఎం సూచించారు. ఐకానిక్‌ టవర్‌ తదితర వాటికి డిజైన్లు రూపకల్పన చేసి, రెండు నెలల్లో టెండర్లు పిలిచేందుకు వీలుగా పనుల వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.  

అధ్యయనం చేయండి 
తాగు నీటితోపాటు వరద నీటి నిర్వహణకు వీలుగా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌ ఉండాలని సీఎం అన్నారు. వివిధ దేశాల్లో అమల్లో ఉన్న ప్రాజెక్టుల నమూనాలు పరిశీలించాలని పురపాలక శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌ సాగర్‌ తాగు నీటిని హైదరాబాద్‌ నగర అవసరాలు తీర్చేందుకు మరింత సమర్ధంగా వినియోగించుకునేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. స్థలం వృథా కాకుండా మూసీ పరీవాహక ప్రాంతం ఇరువైపులా భూగర్భంలో భారీగా వాటర్‌ స్టోరేజ్‌ సంప్‌లు నిర్మించి.. అక్కడి నుంచి నీటి సరఫరా జరిగేలా ఏర్పాట్లు చేయాలని చెప్పారు.    

Advertisement
 
Advertisement
Advertisement