విజిలెన్స్‌లో ఏఐ టాస్క్‌ఫోర్స్‌: వీసీ సజ్జనార్ | AI Task Force Should Be Formed in Vigilance Says VC Sajjanar | Sakshi
Sakshi News home page

విజిలెన్స్‌లో ఏఐ టాస్క్‌ఫోర్స్‌: వీసీ సజ్జనార్

Oct 31 2025 7:54 PM | Updated on Oct 31 2025 8:38 PM

AI Task Force Should Be Formed in Vigilance Says VC Sajjanar

అవినీతి అక్రమాలు, నేరాలను నియంత్రించే క్రమంలో విజిలెన్స్ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తే పారదర్శకత, ఉత్పాదకత రెండూ గణనీయంగా పెరుగుతాయని  హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో శుక్రవారం ఉదయం నిర్వహించిన విజిలెన్స్ అవగాహన వారోత్సవాల ఐదో రోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఈ సమావేశానికి సంస్థ సీఎండీ ఎన్. బలరామ్ అధ్యక్షత వహించారు.

సజ్జనార్ మాట్లాడుతూ.. అవినీతి, అక్రమాలు తగ్గాలంటే వ్యవస్థల్లో మౌలిక మార్పులు అవసరం. లోపభూయిష్టమైన విధానాలు అక్రమాలకు దారితీస్తాయి. కాబట్టి వ్యవస్థను పటిష్ట పరచి, మంచి అలవాట్లు, పద్ధతులను అమల్లోకి తీసుకురావాలని పేర్కొన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని తెలిపారు.

సింగరేణి సంస్థతో తనకు 25 సంవత్సరాల అనుబంధం ఉందని పాత జ్ఞాపకాలను గుర్తు చేశారు. నేడు దేశ జీడీపీ పెరుగుదలలో ప్రభుత్వ రంగ సంస్థల పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ యువ సీఎండీ ఎన్ బలరామ్ సారథ్యంలో పలు వ్యాపార విస్తరణ చర్యల ద్వారా గ్లోబల్ కంపెనీగా రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ దిశగా మరింత వేగంగా ఎదగాలి అని ఆయన తన శుభాకాంక్షలు తెలియజేశారు.

సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. సింగరేణి సంస్థ చేపడుతున్న వ్యాపార విస్తరణ చర్యలను వివరించారు. ఉద్యోగుల్లో క్రమశిక్షణ తీసుకురావడం కోసం, పని గంటల సద్వినియోగం కోసం ప్రత్యేక చొరవ చూపుతున్నామని, వ్యవస్థలను మరింత పటిష్ట పరిచేందుకు ఈసారి విజిలెన్స్ వారోత్సవాలలో ప్రముఖులను ఆహ్వానించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో దేశంలోని 10 రాష్ట్రాల్లోనూ కార్యకలాపాలు నిర్వహించేలా, అలాగే అంతర్జాతీయంగా ఖనిజ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేలా విస్తరణ ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement