పెద్దపల్లి జిల్లా: మాయమాటలు చెప్పి బాలికను లైంగికంగా వేధించిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని ఓ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి(52) ఇదే గ్రామానికి చెందిన బాలిక(17)ను ప్రలోభపెట్టి తన ఇంటికి పిలిపించి అత్యాచారం చేసినట్లు బాలిక తన తండ్రికి వెల్లడించినట్లు సమాచారం. బాలిక మూడు రోజులుగా పాఠశాలకు వెళ్లకపోవటంతో తండ్రి ఆరా తీయగా..ఓ వ్యక్తి తనకు డబ్బులు ఇస్తూ పాఠశాలకు వెళ్లొద్దని చెబుతున్నాడని తెలిపినట్లు సమాచారం.
సదరు వ్యక్తి తనను మధ్యాహ్నం ఇంటికి పిలిపించి లైంగికదాడికి పాల్పడినట్లు చెప్పడంతో తండ్రి గ్రామ పెద్దలను ఆశ్రయించినట్లు తెలిసింది. బాలిక తండ్రి గ్రామ పెద్దలను సంప్రదించగా నిందారోపణ ఎదుర్కొంటున్న వ్యక్తి కుమారుడు అందుబాటులో లేని కారణంగా పంచాయితీని కొన్నిరోజులు వాయిదా వేసినట్లు సమాచారం. సోమవారం కుమారుడు గ్రామానికి రావటడంతో పెద్దలు సదరు వ్యక్తిని బాలిక ఇంటికే పిలిపించి మాట్లాడినట్లు తెలిసింది.
ఈ క్రమంలో పెద్దమనుషులు అత్యాచారం చేసిన వ్యక్తిని బాలిక తండ్రి కాళ్లు మొక్కి మరోసారి ఇటువంటి తప్పులు చేయనని ప్రాధేయపడాలని సూచించినట్లు సమాచారం. దీంతో అతడు తాను తప్పు చేశానని, క్షమించాలని పంచాయితీ పెద్దల సమక్షంలోనే బాలిక తండ్రిని ప్రాధేయపడుతూ కాళ్లుమొక్కాడు. కోపోద్రిక్తుడైన బాలిక తండ్రి సదరు వ్యక్తిపై దాడిచేయగా అక్కడ నుంచి పారిపోయినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీకాంత్ పోలీసులతో బాలిక ఇంటికి వెళ్లి మహిళా పోలీసుతో బాలికతో మాట్లాడించి వివరాలు సేకరించారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక వాంగ్మూలం, ఇతర అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు.


