
( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయినట్లు చైర్మన్ వి.వి. శ్రీనివాస్రావు ప్రకటించారు. కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు వివిధ స్థాయిల్లో నిర్వహించిన పరీక్షలకు సంబంధించి తుది రాతపరీక్షల్లో ఉత్తీర్ణులైన వారి సరిఫికెట్ల పరిశీలన పూర్తయి, క్రోడీకరణ ప్రక్రియ కొనసాగుతున్నట్లు ఆయన శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
ప్రాథమిక రాత పరీక్ష, ఆ తరువాత దేహదారుఢ్య పరీక్ష, తుది రాత పరీక్ష తరువాత మొత్తం 1.2 లక్షల మందికి చెందిన దరఖాస్తులు పూర్తి పారదర్శకంగా వెరిఫికేషన్ జరిగినట్లు వివరించారు. ఉద్యోగుల ఎంపిక తుది దశకు చేరుకుంటున్న తరుణంలో బ్రోకర్లు, మధ్యవర్తులు రంగప్రవేశం చేస్తారని, డబ్బులు ఇస్తే ఉద్యోగం ఇప్పిస్తామని హామీలు ఇస్తారని, అలాంటి వారి పట్ల అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇలాంటి మధ్య దళారులకు సంబంధించిన సమాచారం అందిస్తే రూ. 3 లక్షల రివార్డు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఉద్యోగాలు మెరిట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నారు. మధ్యదళారీలు ప్రలోభాలకు గురి చేస్తున్నట్లు మీ దృష్టికి వస్తే 93937 11110 లేదా 93910 05006కు ఫోన్ చేసి చెప్పవచ్చని బోర్డు చైర్మన్ తెలిపారు.
చదవండి: కెపాసిటీ లేనపుడు ఎందుకు ముగ్గురు? ట్రిపుల్.. ట్రబుల్ అవసరమా?