– ఎంపీ వైద్యలింగం స్పష్టం
సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో తమిళగ వెట్రి కళగంతోనే కాంగ్రెస్ పొత్తు అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ వైద్యలింగం స్పష్టం చేశారు. తట్టాంచావడి ఉప ఎన్నికల్లో టీవీకే పోటీ చేస్తే, కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం వైద్యలింగం విలేకరులతో మాట్లాడుతూ.. పుదుచ్చేరి సీఎం రంగస్వామి నియంతృత్వ పోకడలను అనుసరిస్తున్నారని మండిపడ్డారు. మంత్రివర్గం, శాసనసభ అవసరం లేదంటూ ఆయన ఒక్కరే పరిపాలనను నడుపుకుంటారా..? అని ప్రశ్నించారు. పుదుచ్చేరిలో టీవీకేతో కాంగ్రెస్ పొత్తు అని ప్రకటించిన ఆయన తట్టాంచావడి నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఉప ఎన్నికల్లో స్నేహపూర్వక పోటీకి అవకాశం లేదున్నారు. విజయ్ పార్టీ అయిన టీవీకేను డీఎంకే తక్కువ అంచనా వేయడమే ఓటమికి కారణంగా పేర్కొన్నారు. తాము స్నేహపూర్వకంగా పోటీ చేసిన స్థానాల్లో డీఎంకే విజయం సాధించిందని పేర్కొంటూ, తట్టాంచావడి ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో కూటమికి డీఎంకే నాయకత్వం వహించింది, ఈ దృష్ట్యా, ఓటమికి కూడా డీఎంకేనే బాధ్యత వహించాలని హితవు పలికారు. కూటమిలోని పార్టీలతో డీఎంకే ఏకపక్షంగా చర్చలు జరిపిందని మండి పడ్డారు. తట్టాంచావడిలో టీవీకే పోటీ చేస్తే కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని, ఇది సీఎం నియోజకవర్గం అని ఎన్నికలలో ప్రజలు ఓట్లు వేశారని, అయితే, ఉప ఎన్నికలలొఓ ఆ పరిస్థితి ఉండదన్నారు. అధికార పక్షానికి వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని , ఉప ఎన్నికలలో కాంగ్రెస్మద్దతు కీలకంగా మారిందన్నారు.
పళని పంచామృతం,
దర్శన ధరలను పెంచొద్దు
– విశ్వహిందూ పరిషత్ డిమాండ్
సాక్షి, చైన్నె: మురుగన్ (సుబ్రమణ్య స్వామి)కి చెందిన ఆరుప్పడై వీడులలో మూడో పడై వీడు (ఆరు క్షేత్రాలలో ఒకటి) అయిన పళని ఆలయంలో భక్తులు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసే పంచామృతం ప్రసాదం ధరను, అలాగే స్వామివారి దర్శన టికెట్ల ధరలను పెంచవద్దని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర జాయింట్ జనరల్ సెక్రటరీ, అడ్వకేట్ చంద్రశేఖరన్ తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మదురైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి తర్వాత పళని మురుగన్ ఆలయానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వస్తుంటారని, తమిళనాడు ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని అందించే దేవాలయాల్లో పళని ప్రథమ స్థానంలో ఉందని పేర్కొన్నారు. అయితే, ఇంత భారీగా ఆదాయం వస్తున్నప్పటికీ భక్తులకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు అక్కడ సరిగ్గా లేవని ఆయన విమర్శించారు. కొండపైకి వెళ్లే భక్తుల కోసం అదనపు రోప్ కార్లు, వించ్ వంటి ఆధునిక సదుపాయాలను విస్తరించడానికి పాలకులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం..
తమిళనాడులోని ప్రస్తుత తమిళగ వెట్రి కళగం ప్ర భుత్వం పళని పంచామృతం ధరను, దర్శన రుసుములను పెంచేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందని, దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరి స్తూ నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆయన మండిపడ్డారు. తమిళనాడు ప్రభుత్వం వెంటనే ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని డిమాండ్చేశా రు. ప్రతిరోజూ వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధల తో కొనుగోలు చేసే మురుగన్ ప్రసాదమైన పంచామృతం నాణ్యతను మరింతపెంచాలే తప్ప, ధరలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ పెంచకూడదన్నారు. అలాగే, దర్శన రుసుం కూడా పెంచే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు.
విరాలిమలైలో రాజీనామాల జోరు
సాక్షి, చైన్నె : అన్నాడీఎంకే సీనియర్ ఎమ్మెల్యే సీ విజయ భాస్కర్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్పీకర్ జేసిడీ ప్రభాకర్కు మంగళవారం సాయంత్రం ఆయన రాజీనామా లేఖ సమర్పించారు. దీంతో ఆయన ప్రతినిథ్యం వహిస్తున్న పుదుకోట్టై జిల్లా విరాళి మలై నియోజకవర్గంలోని అన్నాడీఎంకే నేతలందరూ తన పదవులకు రాజీనామా చేసే పనిలో నిమగ్నమయ్యారు. పుదుకోట్టై జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలు అశేష సంఖ్యలో కార్యకర్తలు కూడా తమ పదవులకు రాజీనామాలు చేసి అన్నాడీఎంకే కార్యాలయానికి పంపిస్తుండటం గమనార్హం. విజయభాస్కర్కు మద్దతుగా విరాలిమలై ప్రాంత ంలో ముఖ్యులు బయటకు వెళ్తుండంతో అన్నాడీఎంకే వర్గాలలో కలవరం నెలకొంది. కాగా తనకు మద్దతు నిలిచిన ఓటర్లు, నాయకులకు విజయ భాస్కర్ కృతజ్ఞతలు తెలియజేశారు.అలాగే, సొంత కార్యకర్తల మనసు గెలవలేని నాయకత్వం, ప్రజల మనసులను ఎలా గెలుస్తుంది? అంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామిని ఉద్దేశించి విజయ భాస్కర్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


