సాక్షి, చైన్నె: వైద్య సంరక్షణ రంగాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేలా, సరిహద్దులతో సంబంధం లేకుండా వైద్య సేవలు అందించే రోబోటిక్ అసిస్టెడ్ కార్డియాక్ టెలిసర్జరీ (రోబోట్ సహాయంతో సుదూర ప్రాంతం నుండి చేసే గుండె ఆపరేషన్)ను వైద్యులు విజయవంతం చేశారు. పూర్తిగా భారతదేశంలోనే తయారైన ఐ మంత్ర సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ ద్వారా కేవలం 4 గంటల 50 నిమిషాలలో ఈ క్లిష్టమైన శస్త్రచికిత్స విజయవంతంగా ముగించారు. రోబోటిక్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సుధీర్ శ్రీవాస్తవ గయానా రాజధాని జార్జ్టౌన్లోని పబ్లిక్ హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన ఐ మంత్రాసన టెలి–సర్జన్ కన్సోల్’ (కూర్చుని ఆపరేట్ చేసే కమాండ్ సిస్టమ్)లో కూర్చుని శస్త్రచికిత్సను విజయవంతం చేశారని శనివారం స్థానికంగా ఆ సంస్థ వివరాలను ప్రకటించింది. అలాగే, గయానా నుండి డాక్టర్ సుధీర్ తన చేతులతో చేసిన కదలికలను ఇండోర్లోని రోబోటిక్ చేతులు అత్యంత ఖచ్చితత్వంతో అనుకరిస్తూ రోగికి గుండె ఆపరేషన్ చేశాయని వివరించారు. ఈ శస్త్రచికిత్సకు మణిపాల్ హాస్పిటల్స్ చీఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ లలిత్ మాలిక్, భండారీ హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ రామ్ శుక్లా, ఐఆర్సీఏడీ ఇండియా ప్రెసిడెంట్ డాక్టర్ మోహిత్ భండారీ నేతృత్వంలోని బృందం సాయం చేసినట్టు పేర్కొన్నారు.


